సీఎం నివాసం ప్రగతిభవన్ సమీపంలోని భవనంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ సమీపంలోని ఓ ప్రైవేట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వాణిజ్య భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలను అదుపులోకి తెచ్చారు. రెండో అంతస్తులో ఉన్న ఓ కంపెనీలో వినాయకుడి విగ్రహం వద్ద ఉన్న దీపం సోఫాపై పడటంతోనే మంటలు అంటుకుని భవనంలో మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం జరిగి ఉండేది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ఇది ఇలావుండగా, బేగంపేటలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.
మంటలను గమనించిన ఆస్పత్రి సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆరో అంతస్తులో చెత్త ఉండటం వల్లే ఒకసారిగా మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా నిర్థారించారు.