మరో ప్రమాదం.. చెల్పూరు కేటీపీపీలో ప్రమాదం.. తప్పిన ముప్పు..?
చెల్పూర్ కేటీపీపీలో మరో ప్రమాదం జరిగింది. ఇదీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మంటలు చెలరేగాయి. యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్లో షార్ట్ సర్క్యూట్ అయింది. యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ పంప్ మోటర్లో మంటలు వచ్చాయి. బాటమ్ యాష్ ఓవర్ ఫ్లో పంప్ మోటార్ కాలిపోయింది. అయితే ఆ సమయంలో కార్మికులు లేకపోవడంతో ముప్పు తప్పింది.
వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలతో కలకలం రేగుతోంది. 10 రోజుల వ్యవధిలో కేటీపీపీలో రెండో ప్రమాదం జరిగింది. దీంతో కేటీపీపీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 25న చెల్పూర్ కేటీపీపీలో భారీ ప్రమాదం జరిగింది. రాత్రి ప్లాంట్లో పేలుడు సంభవించింది. విధుల్లో ఉన్న ఏడుగురు ఉద్యోగులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు కేటీపీపీ ఉద్యోగులు కాగా, మిగతా ఐదుగురు కూలీలు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
కేటీపీపీ మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్ పంపించే మిల్లులో ఉన్నట్టుండి మిల్లర్ పేలింది. పేలుడు వల్ల ప్లాంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గాయపడిన వారిలో ఒకరు ఆర్టిజన్, మరొకరు జేపీఏ కాగా, మరో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒకటో యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది. ఇవాళ రెండో యూనిట్లో ప్రమాదం జరిగింది. ఇవాళ ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. అసలే వేసవి.. ఆపై విద్యుత్ డిమాండ్ ఉంది. ఈ సమయంలో ప్రమాదాల వల్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. మరో నెలరోజుల పాటు విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.