ఏపీకి 2, తెలంగాణని కాకి ఎత్తుకెళ్లిందా: వెంకయ్య 'స్మార్ట్సిటీ' లిస్ట్పై కెసిఆర్
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితా పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు చురకలు అంటించారు. కేంద్రమంత్రి వెంకయ్య చేసిన 'ప్యాకేజీ ఇస్తే లీకేజీ' అన్న వ్యాఖ్యల పైన ధీటుగా స్పందించారు.వెంకయ్య నాయుడులా నేను కూడా ప్రాస మాట్లాడగలనని ఎద్దేవా చేశారు.
స్మార్ట్ సిటీ జాబితాను ఇప్పుడే ప్రకటించారని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు నగరాలను ఇచ్చారని, తెలంగాణను కాకి ఎత్తుకు పోయిందా అని ఎద్దేవా చేశారు. ఏపీ నుంచి కాకినాడ, విశాఖలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చారు. దీనిపై కెసిఆర్ ఘాటుగానే స్పందించారు.
తెలంగాణలో ఒక్క నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు చేయలేదన్నారు. ఏపీకి రెండు ఇచ్చారని, తెలంగాణను పక్కన పెట్టారన్నారు. 'తెలంగాణకు ప్రధాని మోడీ రావడం లేదు, కేంద్రం సహకరించడం లేదని' టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, దానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు 'ప్యాకేజీ ఇస్తే లీకేజీ' అవుతుందని చెబుతున్నారని ఓ విలేకరి ప్రశ్నించారు.
దీనిపై కెసిఆర్ పైవిధంగా స్పందించారు. కేంద్రం నుంచి సహకారం లేదన్నారు. కేంద్రం పక్షపాత వైఖరి అవలంభిస్తోందన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి వచ్చి.. కరువు నివేదిక పంపించలేదని చెబుతారని, కానీ అక్టోబర్ 30లోగా పంపాలని అఫీషియల్గా చెబుతారన్నారు. ఇదేం ద్వంద్వ వైఖరి అన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన సంబంధాలు ఉంటాయని చెప్పారు. ఓ పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఇప్పుడు చెప్పండి.. వెంకయ్య నాయుడు ఇచ్చిన ప్యాకేజీ ఏమిటీ మేం చేసిన లీకేజీ ఏమిటన్నారు.