ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, యువతిపై వ్యభిచారి ముద్ర వేశారు, టెక్కీని బెదిరించారు
హైదరాబాద్: హోటల్లో ఉన్న ఓ యువకుడి గదిలోకి ఓ యువతిని పంపించి, వారిపై వ్యభిచారం చేస్తున్నారనే ఆరోపణ మోపి మోసం చేసిన ముఠాను హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు పట్టుకున్నారు. తాము పోలీసులమని, చానెల్ ప్రతినిధులమని బెదిరించారు. వారి వద్ద నుంచి 3.80 లక్షలు, వెర్నా కారు, 5 సెల్ఫోన్లు, రూ. 50 వేల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం మీడియా సమావేశంలో ఏసీపీ ఎం. వెంకటేశ్వర్లు పంజాగుట్ట సీఐ మోహన్కుమార్, డీఐ వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ఆ వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన కె.భానుప్రకాశ్ ఆలియాస్ ప్రపుల్ వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఎస్ఆర్నగర్లో నివాసం ఉంటున్నాడు. అతనిపై బంజారాహిల్స్, ఎస్ఆర్నగర్ పోలీ్సస్టేషన్లో గతంలో కేసులున్నాయి.
చెన్నైకి చెందిన సాయిరామ్ అలియాస్ సాయి జీడిమెట్ల విలేజ్లో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కొంపల్లికి చెందిన పి.హేమంత్కుమార్ పాత నేరస్థుడు, వరంగల్ జిల్లా గీసుకొండ మండలానికి చెందిన జి.సందీప్ రెడ్డి వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఇతడిపై బేగంపేట పోలీ్సస్టేషన్లో పెట్టీ కేసు ఉంది.
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కె.వినోద్కుమార్ ఐదుగురూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 29న అమీర్పేటలోగల సితార హోటల్కి వెళ్లారు. కౌంటర్ బుక్లో ఎవరెవరు ఏయే గదుల్లో ఉన్నారో చూశారు. కెపీహెచ్బీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవికుమార్ ఓ గదిలో ఉన్నాడని గుర్తించారు. సందీప్ రెడ్డికి ఆన్లైన్లో ఓ యువతి పరిచయమైంది. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతోందని తెలుసుకున్నాడు.
తనకు తెలిసిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధి హోటల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడని అందరూ కలిసి ఆమెను నమ్మించారు. వారు చెప్పినట్టుగా సితార హోటల్ వద్దకు వచ్చింది. ఆమెను కింద కూర్చోబెట్టి సార్తో మాట్లాడి వస్తానని సందీప్ పైకి వెళ్లాడు. అప్పటికప్పుడు ఆ ఇంజనీర్ను పరిచయం చేసుకున్నాడు. తనకు తెలిసిన యువతికి అత్యవసరంగా ఉద్యోగం కావాలని చెప్పాడు. రవికుమార్ ఆమెను తీసుకురమ్మని చెప్పడంతో తీసుకెళ్లాడు.
ఇప్పుడే వస్తానంటూ సందీప్ రెడ్డి బయటకు వెళ్లాడు. అతడు వెళ్లిన కొద్దిసేపటికే హేమంత, భానుప్రకాశ్, సాయిరామ్ ఆ గదిలోకెళ్లారు. తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని హేమంత, భానుప్రకాశ్, ఓ చానెల్ రిపోర్టర్నని సాయిరామ్ చెప్పారు. మీరు వ్యభిచారం చేస్తున్నారని, తమకు సమాచారం వచ్చిందంటూ వారిపై చేయి చేసుకున్నారు. యువతి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్, రవికుమార్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులను లాక్కున్నారు.
ఏటీఎం నుంచి 1.85 లక్షలు, ఆన్లైన్ ద్వారా లక్ష రూపాయలు, గతనెల 30న డెబిట్ కార్డులో 1.45 లక్షల షాపింగ్ చేసి బార్లలో ఎంజాయ్ చేశారు. ఈ నెల 1వ తేదీన వారందరూ కలిసి రవికుమార్ కార్యాలయానికి వెళ్లారు. సెల్ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు ఇవ్వాలంటే రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు, రిపోర్టర్ అని భయపడ్డ రవికుమార్ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
ఈ నెల 21న రవికుమార్ జీవీకే 1 మాల్లోకి వెళ్లగా అతడికి వినోద్, సాయికుమార్ కనిపించడంతో పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మాల్కు చేరుకొని వినోద్, సాయికుమార్తోపాటు ప్రధాన నిందితుడు భానుప్రకాశ్, సందీప్రెడ్డి, హేమంతకుమార్ను అదుపులోకి తీసుకున్నారు.