తెలంగాణలో మరో 5 ఒమిక్రాన్ కేసులు, మొత్తం 67కి చేరిక: కొత్తగా 280 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,926 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 280 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,81,587కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనావైరస్ బారినపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4025కి చేరింది. కరోనా బారి నుంచి బుధవారం 206 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3563 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 143 మంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా.. నలుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. కాగా, ఇప్పటి వరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి మొత్తంగా 12,410 మంది రాష్ట్రానికి వచ్చారు.
న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ వ్యాప్తంగా ఆంక్షలు: ర్యాలీలు, సభలు నిషేధం
తెలంగాణలో కరోనావైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నారు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర పోలీసులు. హైదరాబాద్లో మాత్రం మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు.. కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు.
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్లోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్టు ఇప్పటికే సీపీ సీవీ ఆనంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. నెక్లెస్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పై వాహన రాకపోకలు నిషేధించినట్టు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి (డిసెంబర్ 31) నుంచి జనవరి 1న ఉదయం వరకు హైదరాబాద్లోని అన్ని ఫ్లై ఓవర్ల మూసివేస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు.. అతి వేగంగా ప్రయాణించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్రిపుల్ రైడర్స్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ.
కాగా, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిదిలోని బార్లు, పబ్ల యజమాన్యంతో పోలీసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేశామన్నారు. మైనర్లను పబ్లకు అనుమతించొద్దని, కరోనా నిబంధనలను పాటించాలని పబ్, బార్ యజమానులను ఆదేశించారు.
సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. పబ్లు, బార్ల యజమానులు ఆరోగ్యశాఖ విధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించవద్దంటూ సూచించారు. ఆంక్షలు నిబంధనల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దొరికితే జైలు, జరిమానా శిక్షలుంటాయని తెలిపారు. శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని కోరారు. వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్ను కచ్చితంగా పాటించాలని సూచించారు. కాగా, న్యూఇయర్ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటి గంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
కరోనా నిబంధనలకు అనుగుణంగా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజలను కోరారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పబ్బులు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలని పాటించాలన్నారు. కరోనా నిబంధనలు అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. కరోనా నిబంధనలను పోలీస్ శాఖ కఠినంగా అమలు చేస్తుందని డీజీపీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications