భద్రాచలంను చుట్టుముడుతున్న వరద - వంతెనపై రాకపోకలు బంద్ : 114 సెక్షన్ విధింపు..!!
భారీ వర్షాలతో గోదావరి పోటెత్తుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద ముంచెత్తుతోంది. భద్రాచలం పట్టణానికి వరద ముప్పు పొంది ఉంది. ఇప్పటికే పట్టణంలోని నాలుగు కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. పై నుంచి వస్తున్న గోదావరి వదర ప్రవాహంతో పట్టణ ప్రాంతంలోకి నీరు చేరుతోంది. అటు ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అనేక కాలనీలు పూర్తిగా జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. కొత్తగూడెం లింకు రోడ్డు తెగిపోయే పరిస్థితి ఉంది.
ఏపీలోని కోనసీమ.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లంక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీస అవసరాలు అందక ఆవేదనకు గురవుతున్నారు. భద్రాచలం గోదావరి వంతెనపై సాయంత్రం 5 నుంచి రాకపోకలు బంద్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
పట్ణణంలోని కొత్తకాలనీ, సుభాష్నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీలోకి వరద నీరు చేరింది. ఆ ప్రాంతాల్లోని స్థానికులు బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. గోదావరి ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు బయటకు రాకుండా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా.. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 114 సెక్షన్ విధించారు.

గోదావరి వంతెనపై సాయంత్రం 5 నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించారు. వరద తీవ్రత తగ్గే వరకు.. రెండు రోజుల పాటు రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించారు. మ.12 గంటల వరకు 60.30 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం 18.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు.
రెండు రోజులుగా టెన్షన్ పెడుతున్న కడెం ప్రాజెక్టు కు ముప్పు తప్పింది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకుగాను.. ప్రస్తుత నీటిమట్టం 700 అడుగులకు చేరింది. జలాశయంలోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.... 17 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే, వరద తీవ్రత తగ్గటంతో..ప్రమాదం తప్పిందని వెల్లడించారు. ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతోన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కడెం జలాశయానికి ముప్పు తప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications