మంచిర్యాలను ముంచెత్తిన వరద; జలదిగ్బంధంలో స్థానిక ఎమ్మెల్యే ఇల్లు; పరిస్థితి ఇదే!!
మంచిర్యాల జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక గోదావరి నదికి వరద పోటెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో చాలా గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. వరదలతో మంచిర్యాల జిల్లా అతలాకుతలమౌతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం లో 35 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

జలదిగ్బంధంలో ఎమ్మెల్యే దివాకర్ రావు ఇల్లు
ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఇల్లు కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఎమ్మెల్యేకి కూడా వరద కష్టాలు తప్పలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో మంచిర్యాల లోని పలు కాలనీలు నీటమునిగాయి. ఇక నిన్న రాత్రి కూడా మంచిర్యాల ప్రజలు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు ఎక్కువగా వస్తున్న క్రమంలో కంటి మీద కునుకు వేయలేదు. గోదావరిఖని బ్రిడ్జి దగ్గర వరదనీరు ప్రవహించడంతో మంచిర్యాలకు కరీంనగర్ కు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు
భారీ వరదల కారణంగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇక మంచిర్యాలలో ఇప్పటికే ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను, ఎంసీహెచ్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టు నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు సమాచారం. వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు

మంచిర్యాలలో లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలలో
ఎన్టీఆర్ నగర్తో పాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలను 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించారు. ఇక పునరావాస కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు చెబుతున్నా, అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నామని వరద బాధితులు వాపోతున్నారు. ఇప్పటివరకు మంచిర్యాలలో కుండపోత వర్షాల కారణంగా 300కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారిక సమాచారం.

మంచిర్యాలకు వరద ముంపు అందుకే
గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, కడెం, శ్రీపాద సాగర్ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, మంచిర్యాల అందుకే వరద ముంపుకు గురి అయిందని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications