చంద్రబాబూ! హోదాపై అలా చేయండి: కేటీఆర్ నోట జగన్ మాట
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు విషయమై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ సూచన చేశారు.
కేవీపీ బిల్లు ఈ రోజు చర్చకు, ఓటింగుకు వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. బీజేపీ దాని పైన వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో, బిల్లు వస్తుందా, రాదా వస్తే ఏం జరుగుతుందనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఏపీ సీఎంకు తనదైన శైలిలో సూచన చేశారు. ప్రత్యేక హోదా కేవలం ఏపీ సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టినా ప్రత్యేక హోదా సాధించలేదని చెప్పారు. చంద్రబాబు వల్లే అది వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలను తమ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క తాటి పైకి తీసుకు వచ్చారని, అలాగే హోదా కోసం ఇప్పుడు చంద్రబాబు చేయాలన్నారు.
అన్ని పార్టీలను ఏకం చేయడం ద్వారా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తీసుకు రావొచ్చునని సూచించారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ అదే పని చేసి, నాడు యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు హోదా కోసం కేసీఆర్ను చంద్రబాబు అనుసరించాలన్నారు.
కాగా, చంద్రబాబు కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఏపీ కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.