భారీగా గంజాయి స్వాధీనం, వోల్వో బస్సు బోల్తా
హైదరాబాద్: విద్యుత్ కోతలను నిరసిస్తూ వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి రైతులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం మహబూబాబాద్ - వరంగల్ ప్రధాన జాతీయ రహదారిపై కూర్చోని ఆందోళనకు దిగారు.
దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా స్తంభించాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం నిర్లక్యం చేస్తుందని రైతులు ఆందోళవ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం 7 గంటలైనా విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళనలో దాదాపు 150 మంది రైతులు పాల్గొన్నారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎస్ఐ పవన్ కుమార్ రైతులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు.
కొడంగల్లో వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం
మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. ఎవరో దుండగులు కావాలనే వస్త్ర దుకాణాన్ని తగలబెట్టారని దుకాణ యజమాని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గిరిజనుడు కాల్చి చంపిన మావోయిస్టులు
కొరియర్ అన్న నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని కాల్చి చంపారు. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురం అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిప్పాపురానికి చెందిన మిడియం బాలకృష్ణ అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఆదివారం బాలకృష్ణను మావోయిస్టులు గ్రామం నుంచి అపహరించుకోని వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
1100 కిలోల గంజాయి స్వాధీనం
మెదక్ జిల్లాలోని మనూరు మండలం కొండ్యానాయక్ తండాలో 1100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ. కోటి 20 లక్షలని అంచనా. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యేలిగండ్ల వద్ద వోల్వో బస్సు బోల్తా
మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండల యేలిగండ్ల వద్ద వోల్వో బస్సు బోల్తా పడింది. బస్సులోని ప్రయాణీకులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. వోల్పో బస్సు బళ్లారి నుంచి వస్తుండగా యేలిగండ్ల వద్ద ప్రమాదం జరిగింది.