కేసీఆర్తో మాజీ సీఎం కుమారుడు, జేసీపీ అధినేత అమిత్ జోగి భేటీ
ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవగా.. తాజాగా, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి భేటీ అయ్యారు.
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) దేశ వ్యాప్త విస్తరణ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవగా.. తాజాగా, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగి భేటీ అయ్యారు.
పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బుధవారం ప్రగతిభవన్కు వచ్చిన అమిత్ జోగి.. సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ విధి విధానాలను కేసీఆర్ను అడిగి తెలుసుకున్నారు అమిత్ జోగి.
జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఉందని అమిత్ జోగి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించడాన్ని ఆయన స్వాగతించారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని ప్రశంసించారు. సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరుసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేశారని సీఎం కేసీఆర్ ను అభినందించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కు అమిత్ జోగి శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీని సీఎం కేసీఆర్ కు బహూకరించారు. ప్రస్తుతం జనతా కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఒడిశా మాజీ సీఎం ఒమాంగ్ ఆయన కుమారుడు, ఇతర పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కుమారుడు సీఎం కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.