కాళేశ్వరం ఇష్యూలో విచారణకు మాజీ సీఎం కేసీఆర్..
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారం. ఈ ఇష్యూలో నిజాల్ని నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురు అధికారులను సైతం విచారించింది. షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. కానీ కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఇప్పుడు ఈ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్టు సమాచారం.
ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించిన తర్వాతే.. ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్రావు, ఈటల రాజేందర్లను విచారించకుండానే.. కమిషన్కు అందిన పత్రాల ఆధారంగా నివేదిక సమర్పించేందుకు సిద్దం అయ్యింది.

అయితే ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసేటప్పుడు, ఆ ఆరోపణలపై సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించాలి. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు ఆహ్వానించి.. వివరణలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కమిషన్ విచారణ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దాంతో త్వరలోనే కేసీఆర్కు కమిషన్ సమన్లు పంపించే అవకాశాలున్నాయని ప్రచారం నడుస్తోంది.
గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్కు సమన్లు పంపింది. అయితే విచారణ పూర్తికాకుండానే తనను దోషిగా ప్రకటించేలా జస్టిస్ నర్సింహారెడ్డి ప్రకటనలు చేస్తున్నారంటూ కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి.. ఆయన్ను విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ స్వీకరించారు.
కానీ ఆయన మాత్రం నిర్మాణాలను సమర్థిస్తూ కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు జస్టిస్ ఘోష్ కమిషన్ సైతం కేసీఆర్ వివరణను తెలుసుకునేందుకు రెడీ అవుతుందని అంటున్నారు. కేసీఆర్ కనుక విచారణకు హాజరైతే పొలిటికల్ గా ఏ పరిస్థితులు ఉంటాయి ? వివరణపై కమిషన్ ఎలా స్పందిస్తుంది ? వంటి అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications