అందుకే ఓడిపోయాం: చంద్రబాబు వైపు టీ-కాంగ్రెస్ నేతల వేలు, లేదు.. కొన్నిచోట్ల గెలిచాం!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు.. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైపు వేలు చూపిస్తున్నారు. శనివారం నల్గొండ, నాగర్ కర్నూలు, భువనగిరి, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్ లోకసభ స్థానాల పరిధిలోని నియోజకవర్గాలతో కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ నేతలు, సీనియర్లు భేటీ అయ్యారు.
లోకసభ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. పొత్తులు కూడా కాంగ్రెస్ పార్టీని ముంచాయని, 2019 లోకసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని పలువురు సూచించారు. ఒంటరిగా పోటీ చేస్తే లోకసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల అనుభవాల నేపథ్యంలో పార్లమెంటు అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని కోరారు.

సీట్లు పంచుకోలేని వారు, రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని కేసీఆర్ చెప్పారు
ఎన్నికల్లో ఓటమి, డీసీసీ అధ్యక్షుల నియామాకం, పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్.. లోకసభ నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. పొత్తులే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచాయని కోమటిరెడ్డి వంటి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీట్లనే పంచుకోలేనివాళ్లు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో అప్పటి వరకు కాంగ్రెస్ పక్షాన నిలబడిన ప్రజలు పునరాలోచనలో పడ్డారన్నారు.

సమయం కూడా లేకుండా పోయింది
అభ్యర్థులను ప్రకటించాక ప్రచారానికి సమయం లేకుండా పోయిందని మరికొందరు నేతలు అన్నారు. పార్లమెంటు అభ్యర్థులనైనా కనీసం రెండు నెలలు ముందుగా ప్రకటించాలన్నారు. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఓ పర్యవేక్షణ విభాగం ఉండాలన్నారు. అలాగే, పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

పొత్తులు వద్దని ముందే చెప్పా
తన లాంటి వాళ్లు ఎన్నికల్లో ఓడిపోవడానికి పొత్తులే కారణమని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పొత్తులు వద్దని అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెప్పానని, ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 45 స్థానాలు వరకు కాంగ్రెస్ గెలిచేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు తెరవెనక పెత్తనం చేస్తారని టీఆర్ఎస్ ప్రచారం చేసిందని, దానిని ప్రజలు నమ్మారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవద్దని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ ఏడెనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, తాను నల్గొండ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

చంద్రబాబు ప్రచారంతో కొన్నిచోట్ల గెలిచాం
టీడీపీతో పొత్తు వల్ల ఓడిపోయామని కొందరంటే మల్లు భట్టి విక్రమార్క మాత్రం మరోలా స్పందించారు. చంద్రబాబు ప్రచారంతో కొన్నిచోట్ల లాభం జరిగిందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పొత్తు కలిసి వచ్చిందన్నారు. కూటమి వల్లే ఓడిపోయామనే వాదన పక్కన పెడితే, కేసీఆర్ ఎన్నికలను మొత్తం డబ్బు చుట్టే తిప్పారన్నారు. అధికారంలోకి రావడానికి అన్ని వ్యవస్థలను కలుషితం చేశారన్నారు. ఆరు నెలల ముందు నుంచే కాంగ్రెస్ ముఖ్య నాయకుల నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారన్నారు. కూటమి బలంగా కనిపించడంతో ఎన్నికలను కేసీఆర్ వర్సెస్ చంద్రబాబులా మార్చారన్నారు. ఓటమికి ఎవరో ఒకరు బాధ్యులు కాదని, అందరిదీ అన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications