దివంగత ప్రధాని పీవీకి సన్నిహితుడు, మాజీ మంత్రి మాదాడి నరసింహారెడ్డి మృతి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు అయిన మాదాడి నరసింహా రెడ్డి మృతి చెందారు. 85 సంవత్సరాల వయసున్న మాదాడి వయోభారం మీద పడడంతో, అనారోగ్య సమస్యలతో ఈరోజు తెల్లవారుజామున ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించి రెండుసార్లు మంత్రిగా కీలక పాత్ర పోషించిన మాదాడి నరసింహారెడ్డి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు.
1978 లో ఏర్పడిన శాయంపేట నియోజకవర్గం నుండి మాదాడి నరసింహారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధర్మారెడ్డి పై గెలిచిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో క్యాబినెట్ మంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లో నరసింహారెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేశారు.

వరంగల్ జిల్లాలో కీలకంగా వ్యవహరించే కొండ మురళి వంటి నాయకులను పార్టీ లో తయారు చేసిన ఘనత మాదాడి నరసింహారెడ్డిదే. దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అత్యంత సన్నిహితుడిగా మాదాడి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేసిన ఆయన, మంత్రిగానూ తనదైన శైలిలో పని చేశారు. వయోభారం మీద పడడంతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన నేడు దివంగతులయ్యారు.












Click it and Unblock the Notifications