మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత: సీఎం కేసీఆర్ సహా మంత్రులు సంతాపం
హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మహమ్మద్ ఫరీదుద్దీన్(64) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఫరీదుద్దీన్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో 2004లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఫరీదుద్దీన్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

జహీరాబాద్ జిల్లా హోతీబీ గ్రామంలో జన్మించారు ఫరీదుద్దీన్. 1999లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఫరీదుద్దీన్. ఆ తర్వాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఫరీదుద్దీన్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మైనార్టీ నేతగా, ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల మంత్రులు హరీశ్ రావు, కొప్పులు ఈశ్వర్, జగదీష్ రెడ్డి, తదితర నేతలు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications