దీక్ష ఎఫెక్ట్: జగన్కు మరో ఝలక్, మాజీ ఎమ్మెల్యే రాజీనామా
హైదరాబాద్/విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో మరో షాక్ తగిలింది. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల పైన జగన్ కర్నూలులో దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో తెలంగాణ సీనియర్ నేత ఆయనకు ఝలకిచ్చారు.
కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా జగన్ నేటి నుంచి కర్నూలులో మూడు రోజుల పాటు జలదీక్ష పేరిట ధర్నాకు దిగారు. జగన్ ధర్నాను తీవ్రంగా పరిగణించిన పార్టీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి ఆయనకు షాకిచ్చారు.
దీక్ష కోసం తన సొంతూరు పులివెందుల నుంచి జగన్ కర్నూలుకు బయలుదేరిన సమయంలోనే హైదరాబాదులో ఎడ్మ కిష్టారెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసిపికి రాజీనామా చేసి, తెరాసలో చేరిన విషయం తెలిసిందే.

జగన్ పైన గంటా ఆగ్రహం
జగన్ దీక్ష పైన మంత్రి గంటా శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. జగన్ మూడు రోజుల దీక్షను ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకే తెలియదని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని గంటా వ్యాఖ్యానించారు.
రాజకీయాలు, ప్రాజెక్టులపై అనుభవం లేనితనంతోనే జగన్ దీక్షకు దిగుతున్నాడన్నారు. ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకునేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కర్నూలు శివారులోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద కేంద్రీయ విద్యాలయం సమీపంలో జగన్ దీక్షకు దిగారు.












Click it and Unblock the Notifications