మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత .. కరోనా కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో మృతి
కరోనామహమ్మారి రాజకీయనేతల ఉసురు తీస్తోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన ఘటన మరువకముందే మాజీ ఎంపీ నంది ఎల్లయ్య నేడు కరోనా కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు .
78 ఏళ్ల నంది ఎల్లయ్య రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు . జులై 29న కరోనా బారినపడి అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన నంది ఎల్లయ్య కరోనాతో పోరాటం సాగించారు. కరోనా నెగిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా కరోనా కారణంగా తలెత్తిన ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడిన నంది ఎల్లయ్య చివరకు నేడు కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో పనిచేసిన నంది ఎల్లయ్య టిపిసిసి ఉపాధ్యక్షుడుగా కూడా పని చేశారు.నంది ఎల్లయ్య ఇప్పటివరకు ఐదు సార్లు లోక్ సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.
Recommended Video
2014 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మంద జగన్నాథం ను ఓడించి 16వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఐదు సార్లు లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది .గత ఎన్నికల్లో కూడా పార్టీ కోసం కీలకంగా పనిచేశారు నంది ఎల్లయ్య. నంది ఎల్లయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.