రాజయ్యపై దాడికి యత్నం, రెండో కోడలుపై కేసు!: మార్చురీ వద్ద ఎర్రబెల్లి ధర్నా
వరంగల్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య ఇంటిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ప్రమాదం విషాదం నింపింది. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లల మృతి కేసులో.. రాజయ్యను, కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని మహిళా సంఘాలు ధర్నా చేశాయి.
మహిళా సంఘాలు ఓ సమయంలో రాజయ్య పైన దాడికి యత్నించాయి. సారికతో పాటు చిన్నారులను చూసేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగే, రాజయ్య ఇంటి ఎదుట మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. సాయంత్రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ సమయంలో మాంసం ముద్దల్లా మారిన ఆ నలుగురి శవాలను చూసి మహిళా సంఘాల నేతలు తట్టుకోలేకపోయారు. అప్పటికే రాజయ్య, కుటుంబ సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీస్ జీపులో కూర్చున్న రాజయ్య పైన దాడికి ప్రయత్నించారు.
పరిస్థితిని చూసిన పోలీసులు.. జీపును వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో రాజయ్య దాడి నుంచి తప్పించుకున్నారు.
రాజయ్య రెండో కోడలుపై కేసు నమోదు
కలకలం రేపిన సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనం కేసుకు సంబంధించిన చిక్కుముడి ఇంకా వీడలేదు. హత్యా, అత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ప్రాథమికంగా హత్య జరిగిందనే నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
రాజయ్య కుటుంబ సభ్యులను పోలీసులు మామునూరు పోలీస్ స్టేషన్లో ఉంచి పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ రోజు నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశముంది. మరోవైపు, అనిల్, సారికల మధ్య విభేదాలకు కారణంగా భావిస్తున్న అనిల్ రెండో భార్య సన పైనా పోలీసులు కేసు నమోదు చేసే విషయమై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
మార్చురీ వద్ద ఎర్రబెల్లి ధర్నా
రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు గురువారం మధ్యాహ్నం మార్చురీ వద్ద ధర్నాకు దిగారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలోను మార్చురీ వద్ద ఆందోళన చేశారు. సారిక, ముగ్గురు పిల్లల పోస్టుమార్టం ఎంజిఎంలో పూర్తయింది.