2019కి నయీం ప్లాన్, లింక్స్పై మాజీ అధికారి, టిడిపి నేత శివానంద
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంకు రాజకీయ నాయకులు, అధికారులు, సిని పరిశ్రమ.. ఇలా అన్నింటితోను సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. చాలామందిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. 2007 నుంచి నయీం అజ్ఞాతంలోకి వెళ్లాడని భావిస్తున్నప్పటికీ.. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోనే గుట్టు చప్పుడు కాకుండా పర్యటించాడని తెలుస్తోంది. అతనితో లింకులు ఉన్న వారు చూసీ చూడనట్లు వదిలేసి ఉంటారని చెబుతున్నారు.
అధికార బలం.. రాజకీయాల్లోకి వచ్చి చక్రం
తన అరాచకాలు సాగాలంటే ఆయుధంతో పాటు అధికార బలం కూడా కావాలని నయీం భావించాడని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. ఎలాగైనా ఎమ్మెల్యే టిక్కెట్ సంపాదించి, రాజకీయాలలోకి వచ్చి చక్రం తిప్పాలనుకున్నాడని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇప్పటి నుంచి పావులు కదపడం ప్రారంభించాడనే వాదనలు వినిపిస్తున్నాయి. నయీం రాజకీయ ఆరంగేట్రం ఆలోచన నేపథ్యంలో చాలామంది వెన్నులో అది వణుకు పుట్టించిందని అంటున్నారు. గ్యాంగ్ స్టర్గా ఉంటేనే ఇంతలా వణికిస్తుంటే.. రేపు రాజకీయాల్లోకి వచ్చాక ఇంక ఎలా ఉంటుందోననే ఆందోళన చాలామందిలో ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. భువనగిరిలో తన అభ్యర్థిని గతంలో బరిలోకి దింపాడని, అతను ఓడిపోవడంతో తానే రంగంలోకి దిగాలని భావించాడని తెలుస్తోంది.
నయీం వందల కోట్లు సంపాదించాడా: మాజీ అధికారి
తాను కర్నూలు జిల్లాలో రాజకీయంగా పైచేయి సాధిస్తున్నానని, తనను పొలిటికల్గా అణగదొక్కేందుకే నయీం కేసులో తన పేరును తీసుకు వచ్చి ఉంటారని మాజీ పోలీసు అధికారి శివానంద రెడ్డి గురువారం నాడు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
నయీం ద్వారా దాను దందాలు చేశానని, డీఎస్పీని అయ్యానని తన పైన ఆరోపణలు వచ్చాయని, అవన్నీ అవాస్తవమని చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలు అభూతకల్పనలే అన్నారు. నయీం ఎవరో తనకు తెలియదని చెప్పారు.
నయీం డైరీలో 'కడప', అధికారుల ఆరా: గెలిచే దాన్నిగా.. ఉమామాధవరెడ్డి
ఇటీవల నయీం ఎన్కౌంటర్ అయిన తర్వాతనే, అతని గురించి తనకు పూర్తిగా తెలిసిందని చెప్పారు. 1999-2002 మధ్య తాను నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశానని చెప్పారు. తాను నేరుగా డీఎస్పీని అయ్యానని, అలాంటప్పుడు నయీం సహకారంతో ఎలా డీఎస్పీని అవుతానని చెప్పారు.
నయీం వందల కోట్లు సంపాదించాడంటే తాను ఏమాత్రం నమ్మడం లేదన్నారు. తాను అడ్మినిస్ట్రేషన్లో పని చేశానని, ఆపరేషన్లో పని చేయలేదని, అందుకే తనకు నయీం గురించి పెద్దగా తెలియదని చెప్పారు. తాను వాలెంటరీ రిటైర్మెంట్ ఇచ్చి, తన వ్యాపారం తాను చేసుకుంటున్నానని చెప్పారు.
నయీం డైరీలో 99శాతం తెరాస వాళ్లే, మంత్రితో లింక్స్: ఊగిపోయిన కోమటిరెడ్డి
ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్లకు నయీంతో సంబంధాలు ఉంటాయేమో తనకు తెలియదని, కానీ తాను కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నానని, ఇలాంటి బిజినెస్ చేసేవాళ్లకు అతని అవసరం లేదని చెప్పారు. నల్గొండ జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాల్లో నయీం కప్పం వసూలు చేశాడనే అంశం తనకు తెలియదన్నారు.