శాసనమండలికి మాజీ స్పీకర్: గెజిట్ జారీ చేసిన గవర్నర్: కేబినెట్ ఛాన్స్
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. శాసనమండలిపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. స్థానిక సంస్థల కోటాలో నిర్వహించిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఆరుకు ఆరు స్థానాలనూ కైవసం చేసుకుంది. విజయఢంకా మోగించింది. తన పట్టు చేజారలేదని నిరూపించుకోగలిగింది. ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కోసం అయిదు ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసింది. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకపక్ష విజయాన్ని అందుకున్నారు.

మరో శుభవార్త..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరాజయంతో డీలాపడిన టీఆర్ఎస్ శ్రేణుల్లో తాజా ఫలితాలు ఉత్సాహాన్ని నింపాయి. అదే సమయంలో మరో శుభవార్త కూడా అందింది అధికార పార్టీకి. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి.. శాసనమండలికి అధికారికంగా నామినేట్ అయ్యారు. దీనితో ఆయన ఎన్నిక కూడా పూర్తయినట్టయింది. గవర్నర్ కోటాలో ఆయనను శాసనమండలికి పంపించింది టీఆర్ఎస్ అగ్రనాయకత్వం.

గెజిట్ జారీ..
మధుసూదనాచారిని మండలికి నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇదివరకే ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ను ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే అధికారికంగా జారీ చేసింది. దీనితో గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి నియమితులయ్యారు. ఇదివరకు గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆయన పేరును గవర్నర్ ఆమోదించలేదు. దీనితో- ప్రత్యామ్నాయంగా మధుసూదనాచారి పేరును సూచించింది.

2018లో ఓటమి..
2014 సార్వత్రిక ఎన్నికల్లో మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టింది ప్రభుత్వం. 2018లో శాసనసభకు నిర్వహించిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేసి పరాజయాన్ని చవి చూశారు. ఏకంగా మూడో స్థానంలో నిలిచారాయన. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

గవర్నర్ కోటాలో..
ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో గండ్ర వెంకటరమణా రెడ్డి పార్టీ ఫిరాయించారు. టీఆర్ఎస్లో చేరారు. దీనితో భూపాలపల్లి నియోజకవర్గంపై మధుసూదనాచారికి పట్టు కోల్పోయినట్టయింది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆయనకు మరో అవకాశాన్ని ఇచ్చారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేశారు. దీనితో ఆయన మరోసారి చట్టసభల్లోకి అడుగు పెట్టినట్టయింది.

అన్ని స్థానాలు టీఆర్ఎస్కే..
ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థల కోటా కింద గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాద్, తాతా మధుసూదన్, ఎంసీ కోటిరెడ్డి, యాదవ రెడ్డి, దండే విఠల్తో పాటు మధుసూదనాచారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదివరకే ఎమ్మెల్యేల కోటా కింద శాసన మండలి కోసం ఆరుమంది సభ్యులు నామినేట్ అయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్, బండ ప్రకాష్ ఈ జాబితాలో ఉన్నారు.

కేబినెట్లోకి సీనియర్లు..
కేసీఆర్ నిర్వహించ తలపెట్టినట్టుగా భావిస్తోన్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారికి బెర్త్ లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఆయనతో పాటు ఎల్ రమణకు సైతం కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున.. జనవరి-ఫిబ్రవరిల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చంటూ వార్తలు వస్తోన్నాయి.












Click it and Unblock the Notifications