అసెంబ్లీ ఉత్కంఠ: కోమటిరెడ్డి సహా నలుగురి సస్పెన్షన్?, కాంగ్రెసు ప్లాన్ ఇదీ...
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్పై దాడి నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ శాసనసభ మంగళవారం వాడిగా వేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. స్వామి గౌడ్పై దాడి చేశారని భావిస్తున్న కోమటి రెడ్డి వెంకట రెడ్డి సహా నలుగురు కాంగ్రెసు శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video
స్పీకర్ మధుసూదనాచారి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశాల వరకు వారిని సస్పెండ్ చేస్తారా, ఏడాది పాటు సస్పెండ్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. స్పీకర్ ఆ విషయంపై మంగళవారం ప్రకటన చేసే అవకాశం ఉంది.
స్పీకర్దే నిర్ణయమని స్వామి గౌడ్
తనపై జరిగిన దాడి చట్టసభలో జరిగింది కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్వామిగౌడ్ అన్నారు. గవర్నర్ లక్ష్యంగా హెడ్ ఫోన్ విసిరారని, అది తనకూ గవర్నర్కూ మధ్య పడిందని, ఆ తర్వాత మరో వస్తువు తనకు బలంగా తాకిందని ఆయన చెప్పారు. అసెంబ్లీ రూల్స్ బుక్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
కాంగ్రెసు సెల్ఫ్ గోల్
ఎవరిపైనా తాను ఫిర్యాదు చేయబోనని, అందరు సభ్యులూ తనకు సమానమేనని స్వామి గౌడ్ అన్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని సరోజినీ దేవీ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భౌతిక దాడులతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెసు సెల్ఫ్ గోల్ కొట్టిందని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్లాన్ ఇదీ..
తమ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తే శాసనసభను బహిష్కరించాలనే ఆలోచనలో కాంగ్రెసు ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కుట్రపూరితంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వ్వహరిస్తోందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.
కాంగ్రెసు ఆందోళన ఇలా..
గవర్నర్ నరసింహన్ ప్రసంగం సందర్భంగా సోమవారం తెలంగాణ శాసనసభలో కాంగ్రెసు సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో స్వామి గౌడ్ గాయపడ్డారు. డికె ఆరుణ గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపి విసిరారు.