వృద్ధురాలి ఒంటిపై నగలు దోచుకుని లోహపు కడ్డీ చేతిలో పెట్టారు
హైదరాబాద్: మెడలో ఉన్న బంగారం ఇస్తే బంగారు కడ్డీని ఇస్తామని నమ్మించి ఓ వృద్ధురాలిని మోసం చేసిన ఘటన అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం వడ్లకొండ రాజవ్వ(60) ఆదివారం ఖానాపూర్ అంగడిబజార్లో జరిగే సంతకు సరుకులు కొనేందుకు వెళ్లింది.
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సరుకులతో ఇంటికి వస్తుండగా 30 ఏళ్ల పైబడ్డ ఓ మహిళ తనను మాటల్లోకి దింపి, మెడలో ఉన్న బంగారం తమకు ఇస్తే దానికి బదులు 10 తులాల బంగారు కడ్డీని ఇస్తానని చెప్పినట్లు తెలిపింది. అంతలో ఆమెకు మరో మగమనిషి తోడై తన ఒంటి మీద ఉన్న నగలు ఇచ్చేయమని సలహా ఇచ్చాడు.
తనకు తెలియకుండానే తన ఒంటి మీద ఉన్న రెండున్నర తులాల బంగారుం కుత్తి కట్టు, చెవి పడిగెలు తీసుకొని తన చేతిలో బంగారు వర్ణంతో మెరిసే కడ్డీని చేతిలో పెట్టి పారిపోయారని తెలిపింది. వాటి విలువ సుమారు రూ. 70వేల వరకు ఉంటుందని తెలిపింది.
వారు తనతో తెలుగులోనే మాట్లాడరారని, జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెబితే తిడతారన్న భయంతో వెంటనే ఇంట్లో చెప్పలేదని, దొంగలు తన చేతిలో పెట్టిన బంగారు కడ్డీని పరీక్షిస్తే అది వట్టి లోహపు కడ్డీ అని తేలిందన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వృద్ధురాలి సాయంతో ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోసగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు కూడా బంగారం, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరిని పడితే వారిని నమ్మవద్దని సూచించారు.