‘కల్యాణలక్ష్మి’ కక్కుర్తి: కట్టుకున్న భార్యకు రెండు పెళ్లిళ్లు చేశాడు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి పథకం పక్కదారి పడుతోంది. ఆడపిల్లలకు పెళ్లి చేసే కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే లబ్ధిదారులు కాకుండా కాసుల కోసం కక్కుర్తి పడి కట్టుకున్న భార్యకు మరొకరితో పెళ్లి చేసే స్థాయికి దిగజారాడు ఓ ప్రబుద్ధుడు.
నమస్తే తెలంగాణ కథనం ప్రకారం.... నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి కట్టుకున్న భార్యకే రెండు పెళ్లిల్లు చేసిన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు డ్రా చేసుకొని చివరకు కటకటాలపాలయ్యాడు.
దేవరకొండ ఏటీడబ్ల్యూఓ సంజీవరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పాల్తితండాకు చెందిన వీరాసింగ్-ధనకు 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగి నలుగురు పిల్లలు ఉన్నారు. దీంతో వారు కల్యాణ లక్ష్మి కోసం వరుసకు బావ అయిన బాణావత్ చందులాల్ సూత్రధారిగా వ్యవహరించి కల్యాణ లక్ష్మి పేరుతో దుర్వినియోగానికి పాల్పడ్డారు.
ఇందుకోసం వీరాసింగ్ తన భార్య అయిన ధనను నాంపల్లి మండలంలోని కేశవనాయక్తండాకు చెందిన రమావత్ సురేష్కు మే 25, 2015లో వివాహం చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి రూ.51 వేలను గ్రామీణ వికాస్ బ్యాంక్లోని ధన ఖాతా నుంచి డ్రా చేశారు.

ఆ తర్వాత తిరిగి 20 రోజుల వ్యవధిలో ధనకు పుల్లిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని బాసోనిబాయితండాకు చెందిన బాణావత్ స్వామితో 14జూన్, 2015లో మరోమారు వివాహం జరిగినట్లు నకిలీ దరఖాస్తు సృష్టంచాడు. తర్వాత పెద్దవూర అంధ్రా బ్యాంకు నుంచి మరో రూ.51వేలు డ్రా చేశారు.
ఇలా ఒకే మహిళకు రెండు పెళ్లిల్లు చేసి రూ.1.02లక్షలు డ్రా చేసినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో ధన-వీరాసింగ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అయితే ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన చందూలాల్ పరారీలో ఉన్నాడు.
అదేవిధంగా పొట్టిగాని తండాకు చెందిన ధనుజ, ఆయన కుమార్తె మీనాకు జైరాంతండాకు చెందిన హనుమానాయక్తో వివాహం జరగగా, అదేగ్రామానికి చెందిన రమేష్, వినోద్ వీరి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేశారు. వీరి నుంచి కల్యాణలక్ష్మి పథకం కింద రూ.51వేలు మంజురు చేశారు.
వాటిలో రమేష్, వినోద్ రూ.15,500 తీసుకుని, రూ.35,500 మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చిన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇలా మండలంలో మరిన్ని కల్యాణలక్ష్మి దరఖాస్తులపై విచారణ కొనసాగుతుందని, అర్హతలేకుండా నిధులు మింగినవారు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ప్రసాద్రావు తెలిపారు.












Click it and Unblock the Notifications