ఎలక్ట్రిషియన్ నుంచి ఉగ్రవాదిగా మారిన అజీజ్: గట్టిభద్రత మధ్య హైదరాబాద్కు
హైదరాబాద్: ఇటీవల అరెస్టయిన ఉగ్రవాది మొహమ్మద్ అబ్దుల్ అజీత్ బాబ్రీ మసీదు విధ్వంసం(1992) తర్వాత జిహాదీలో చేరినట్లు తెలుస్తోంది. 1980లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన మొహమ్మద్ ఫసియుద్దీన్(నల్గొండకు చెందినవాడు) బృందం ద్వారా అజీజ్ ఉగ్రబాట పట్టాడు.
డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసిన అజీజ్ ఎలక్ట్రిషియన్గా పని చేసుకుంటూ నగరానికి చెందిన దర్సగ ఈ జిహాదో షాహాదత్ సంస్థతో కలిసి పని చేశాడు. మెహబూబ్కి హెహందీ ప్రాంతంలో వ్యభిచారానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశాడు. 1989లో అజీజ్ సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఎలక్ట్రిషియన్గా పని చేశాడు. అక్కడ కొంత డబ్బు సంపాదించుకుని హైదరాబాద్ నగరంలో సొంత వ్యాపారం పెట్టేందు కోసం మళ్లీ ఇక్కడికి వచ్చాడు.
1992లో బాబ్రీ మసీదు విధ్వంసంతో జిహాదీలో కలిసేందుకు మళ్లీ సౌదీకి పయనమయ్యాడని అజీజ్ కేసు విచారిస్తున్న తెలంగాణ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సిఐడి)కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. సౌదీ అరేబియాలో ఉగ్రవాద గ్రూపులతో కలిసిన అజీజ్కు ఫసియుద్దీన్, అజం ఘోరీ అనే ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ఆల్ ఖైదాతో సంబంధాలున్న ఓ సౌదీ అంతర్జాతీయ ఎన్జీఓ సంస్థలో అజీజ్ కొంతకాలం పనిచేశాడు. 1994-1996 మధ్య కాలంలో సెర్బియన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సకీం మంహ్ముంజిన్ నేతృత్వంలోని బోస్నేయన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తరపున అజీజ్ పాల్గొన్నాడని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు. బోస్నీయాలోని జెనికాలో బోస్నీయా మిలీషాయా ద్వారా అజీజ్ ఉగ్ర శిక్షణ పొందాడు. ఆ తర్వాత రష్యా సైన్యంతో పోరాడేందుకు చెంచెన్యాలోని షాటోయస్కీకి సౌదీ సహచరులతో పయనమయ్యాడు.
1999లో యూరోప్ నుంచి భారతదేశానికి వచ్చిన అజీజ్పై భారత ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా వేసిపట్టుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అజీజ్ హైదరాబాద్ యువతను జిహాదీల్లో చేర్చే పనిలో పడ్డాడు. గల్ఫ్కు మొహమ్మద్ నిస్సార్ను తీసుకెళ్తుండగా మరోసారి పట్టుబడ్డాడు. వారివద్ద పలు విధ్వంసకర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
రెండు కేసుల్లో అజీజ్ నిందితుడిగా ఉన్నాడు. మొదటిసారి హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో అజీజ్ తోపాటు నిస్సార్ అరెస్టయ్యాడు. రెండోసారి సికింద్రాబాద్లోని గణేష్ ఆలయంలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్లు సిఐడి అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న అజీజ్ ఇటీవలే మనదేశంలోని లక్నోకు రావడంతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో అజీజ్పై కేసులు నమోదు కావడంతో ఇక్కడి పోలీసులు అతడ్ని గురువారం నగరానికి గట్టి భద్రత మధ్య తీసుకొచ్చారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద అజీజ్ను హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు హైదరాబాద్ అడిషనల్ కమిషనర్(క్రైం) స్వాతీ లక్రా తెలిపారు. అతడ్ని విచారించి కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.