హైద్రాబాద్లో కేరళ సీఎం కారులో పొగలు, ఏపీలా చేయం: అసెంబ్లీపై హరీష్ రావు
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఫిలిం నగర్ సమీపంలో ఆదివారం నాడు కేరళ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారులో పొగలు వచ్చాయి.
అయితే, ఆ సమయంలో కేరళ సీఎం ఊమెన్ చాందీ అందులో లేరు. అదే సమయంలో కారులో తలెత్తిన సాంకేతిక లోపంను వెంటనే గుర్తించారు. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అంతకుముందు ఊమెన్ చాందీ మాట్లాడుతూ... తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరం అన్ని వర్గాలు, మతాలు, రాష్ట్రాలవారు నివసించే నగరమన్నారు.
కేరళ భవన్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్కు మలయాళీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. శబరిమలలో తెలంగాణకు ఐదు ఎకరాల స్థలం కేటాయించామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

అన్ని అంశాలను చర్చిస్తాం, ఏపీలా చేయం: హరీష్ రావు
ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు ఆదివారం చెప్పారు. రైతుల ఆత్మహత్యల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేస్తారన్నారు.
రైతు ఆత్మహత్యలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై గొడవ చేస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా అసెంబ్లీ సమావేశాలను తాము పరిమితంగా నిర్వహించమని చెప్పారు.
కొత్త డిజిపి కోసం కేంద్రానికి తెలంగాణ లేఖ
కొత్త డిజిపి నియామకం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఐదుగురు పేర్లను పంపించింది. విభజన అనంతరం అనురాగ్ శర్మ ఇంచార్జి డిజిపిగా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి డిజిపి కోసం లేఖ రాసింది.
పూర్తిస్థాయి, నూతన డీజీపీ నియామకం కోసం ఐదుగురు పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి ప్రభుత్వం లేఖ పంపింది. అనురాగ్ శర్మ, అరుణ బహుగుణ, తేజ్ దీప్ కౌర్, ఏకే ఖాన్, దుర్గా ప్రసాద్ల పేర్లు అందులో ఉన్నాయి. వారిలో ఏకే ఖాన్, అనురాగ్ శర్మలు డీజీపీ రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిస్థాయి డిజిపిగా అనురాగ్ శర్మకు అవకాశం ఉండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications