కరోనా చికిత్స పొందుతూ మావోయిస్టు నేత గడ్డం మధుకర్ మృతి: అతనిపై 8 లక్షల రివార్డు
హైదరాబాద్: కరోనావైరస్ బారినపడి చికిత్స కోసం వచ్చి ఇటీవల వరంగల్లో పోలీసులకు చిక్కిన మావోయిస్టు నేత గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ శభ్రయ్ ఆస్పత్రిలో మృతి చెందాడు. జూన్ 2న అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి, కరోనా చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు మధుకర్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మధుకర్ స్వస్థలం కుమురంభీం జిల్లా బెజ్జూర్ మండలం కొత్తపల్లి గ్రామం. 1999లో క్రితం పీపుల్స్ వార్ దళంలో ఆయన సభ్యుడిగా చేరారు.
మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు అతడి స్వస్థలానికి తరలించారు. మధుకర్ దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. మధుకర్పై 8 లక్షల రివార్డు ఉండటం గమనార్హం. కాగా, ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు కరోనా బారినపడుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 97,751 మంది నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. 1436 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,91,170కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం సాయంత్రం వివరాలను వెల్లడించింది.
గత 24 గంటల్లో కరోనా బారినపడి 14 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3,378కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి 3614 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,60,776కు చేరింది. రాస్ట్రంలో రికవరీ రేటు 84.85 శాతంగా ఉంది. మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.
జీహెచ్ఎంసీ పరిధిలో 184 కరోనా కేసులు నమోదు కాగా, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 100కుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,58,61,242 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో 27,016 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.