తెరపైకి నయీం బినామీలు: ఎవరా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే?
హైదరాబాద్: వేల కోట్లు ఆస్తులు కూడబెట్టిన గ్యాంగ్స్టర్ నయీం బినామీలెవ్వరు? అన్న కోణంలో సైతం పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లో పోలీసులు ఎదురు కాల్పుల్లో గ్యాంగ్స్టర్ నయీం హతమైన సంగతి తెలిసిందే.
నయీం హతమైనప్పటి నుంచి పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. దీంతో నయీం ఆస్తులకు బినామీలుగా వ్యవహరించిన వ్యక్తులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. హైదరాబాద్ నగర శివారుతో పాటు భువనగిరి-హైదరాబాద్ మధ్య వేల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన వందల డాక్యుమెంట్లు నయీం బంధువుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో భువనగిరి సిటీతో పాటు హైదరాబాద్ నగర చుట్టుపక్కలకు చెందిన 20 మంది వరకు బినామీలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నయీం హతమైన తర్వాత ఇప్పుడు వీరంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నయీం బాధితులు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను కలిసి వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ఈ బాధితుల్లో నగరానికి చెందిన రాజకీయ, పారిశ్రామిక ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని కూడా విచారించే అవకాశం ఉంది. తాజాగా శివార్లలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు నయీం గ్యాంగ్తో సంబంధాలున్నట్లు, ఓ భూవివాదానికి సంబంధించి ఎమ్మెల్యే రూ. 3 కోట్ల లావాదేవీ జరిపినట్లు పోలీసు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, మంగళవారం నయీం బినామీగా వనస్థలిపురంకు చెందిన శ్రీధర్గౌడ్కు ఏడాది కాలంగా నయీంతో సత్సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రకంగా నగరంలో ఇంకెంత మంది ఉన్నారోనన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
బినామీలు గుట్టురట్టు
కేవలం రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లోనే గాక, వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలకమైన విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వారు, ప్రస్తుతం పదవుల్లో ఉంటూ నయీంకు ఆశ్రయమిస్తూ, ఆయన బినామీగా కొనసాగుతున్న వారి గుట్టురట్టు చేసేందుకైనా గతంలో నరుూం ఆగడాలకు బలైన బాధితులను విచారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.
కొండాపూర్లో 69 ఎకరాలు
కొండాపూర్లో నయీంకు 69 ఎకరాలు ఉన్నట్లు మంగళవారం పోలీసుల సోదాల్లో బయటపడిందంటే ఆ భూమి ఎలా వచ్చింది? వాటికి అసలు యజమానులెవరు? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పాటు ఉప్పల్ కళ్యాణ్పూర్లోని ఓ ప్రముఖ రాజకీయ నేతకు సంబంధించిన స్థలంలో కూడా నయీం జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
వివాదం కారణంగానే పట్లోళ్ల గోవర్థన్రెడ్డి హత్య
ఈ స్థల వివాదం కారణంగానే పట్లోళ్ల గోవర్థన్రెడ్డిని నయీం హత్య చేసి ఉంటాడన్న వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ పాత గాంధీ ఆసుపత్రికి సమీపంలోనున్న నయీం బంధువుల నగల దుకాణం యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
రూ. 5 లక్షలు డిమాండ్
ఈ దుకాణం యజమాని నుంచి గతంలో నయీం రూ. 5లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అడిగిన తేదీ లోపు ఇవ్వకుంటే ఆ మరుసటి రోజు నుంచి రోజుకీ అదనంగా రూ. 5లక్షలు చెల్లించాలని నయీం అల్టిమేటం ఇచ్చినట్లు మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
నయీం బాధితులపై పోలీసులు ఆరా
నయీం బాధితులు ఎవరైనా ఉంటే పోలీసు ఉన్నతాధికారులకు తమ గోడును వెళ్లబోసుకోవాలంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏమైనా న్యాయం జరుగుతుందనే క్రమంలో పలువురు నయీం బాధితులు పోలీసులను కలిసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.