100 మందితో గ్యాంగ్: కోర్టులో లొంగిపోయిన నయీం బావమరిది ఫయీం
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం బావమరిది ఫయీం, అతడి భార్య షహీమ్ శుక్రవారం రాజేంద్ర నగర్ కోర్టులో లొంగిపోయారు. షాద్ నగర్లో నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఫయీం కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరారీలో ఉన్న ఫయీం శుక్రవారం సాయంత్రం కోర్టులో లొంగిపోయారు.
దీంతో కోర్టు వారిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. ఫయీం పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నయీం కోసం ఫయీం ఓ గ్యాంగ్ను నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఫయీం దగ్గర 100 మందితో గ్యాంగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ఎక్కువగా నయీం తరుపున ఫయీం భూదందాలతో పాటు సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాదాబాద్, నల్గొండ, మిర్యాలగుడ, భువనగిరి డెన్లు ఉన్నాయి. అయితే నయీం అక్రమాలకు సంబంధించిన వివరాలు తనకేమీ తెలియదని ఫహీం చెప్పడం గమనార్హం.
నయీం వెన్నుముకగా భావించే ఫయీం కోర్టులో లొంగిపోవడంతో తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. హయత్నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో శ్రీధర్గౌడ్ ఇంటిని ఫహీం సెటిల్మెంట్లకు ఉపయోగించుకునేవాడని పోలీసులు తెలిపారు.
నయీం వద్ద ఫయీం పని చేస్తుంటే... ఫయీం వద్ద శ్రీధర్ గౌడ్, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్రాజు, కరుణాకర్, శ్రీను, బలరాం అనుచరులుగా పనిచేసేవారు. వీరంతా నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్లోని పాఠశాలలో కలసి చదువుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
భూదందాలు, సెటిల్ మెంట్ల వ్యవహారంలో ఫయీం వల్ల కానీపని అయితేనే నయీం రంగంలోకి దిగేవాడని పోలీసుల విచారణలో శ్రీధర్గౌడ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. శ్రీధర్, బలరాం గౌడ్లను గురువారం హయత్నగర్ కోర్టులో హాజరుపర్చిన వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ1గా నయీం, ఏ2గా ఫహీం, ఏ3గా శ్రీధర్గౌడ్లను నిందితులుగా పేర్కొన్నారు.
మరోవైపు నయీం ఇంట్లో పోలీసులు శుక్రవారం కూడా సోదాలు నిర్వహించారు. పుప్పాలగూడలోని నయీం నివాసంలో ఐదో రోజూ రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారులు సోదాలు చేశారు. శుక్రవారం సుమారు రెండుగంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, ఇంట్లో ఉన్న పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.