'ఐ10' ఛానల్ నయీందే: విచారణలో సీఈఓ హరిప్రసాద్ రెడ్డి ఆసక్తికర విషయాలు
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసుల రోజుకో ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. రాజకీయంగా ఆధిపత్యం చెలాయించేందుకే ఐ10 న్యూస్ ఛానెల్లో పెట్టుబడులు పెట్టాడని సిట్ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఐ10 న్యూస్ ఛానెల్ సీఈఓ హరిప్రసాద్ రెడ్డిని విచారించిన పోలీసులకు అవాక్కయ్యే విషయాలు తెలిశాయి.
తన సొంత పెట్టుబడులతో ఐ10 న్యూస్ చానల్ను ప్రారంభించిన నయీం, పేరుకు మాత్రమే సీఈఓగా హరిప్రసాద్ రెడ్డిని నియమించాడని విచారణలో వెల్లడైంది. సమాజం, ప్రజలు తనను హీరోగా భావించాలన్నది నయీం అభిమతమని, మానవత్వం చూపే నేతగా కనిపించాలన్న ఆశతో, మీడియాను మార్గంగా ఎంచుకున్నాడని హరిప్రసాద్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.
గతకంలో పలు పత్రికలు, టీవీ చానళ్లలో పనిచేస్తున్న సమయంలో నయీంకు తాను వ్యతిరేక వార్తలు రాశానని, వాటితోనే నయీంతో తనకు పరిచయం ఏర్పడిందని హరిప్రసాద్ విచారణలో వెల్లడించాడు. తొలుత తనను బెదిరించినా, ఉర్సు ఉత్సవాల్లో నయీం సోదరులకు మంచి కవరేజ్ ఇచ్చినందుకు లక్ష రూపాయల డబ్బిచ్చాడని తెలిపాడు.
ఆ తర్వాత ముస్లిం యువత ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి ప్రచారం కోసం లక్ష ఇచ్చాడని హరిప్రసాద్ అంగీకరించాడు. తనకు ఎంతగానో నమ్మిన నయీం, ఐఫోన్ కూడా ఇచ్చాడని, న్యూస్ ఛానల్ పెట్టాలని చెప్పి 13.50 లక్షలు ఇచ్చాడని, ఆ డబ్బుతోనే ఛానెల్కు అనుమతులు పొందామని తెలిపాడు.
అనుమతులు అనంతరం బంజారాహిల్స్లో ఆఫీసు ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత జిల్లాల వారీగా న్యూస్ ఛానల్ ఫ్రాంచైజీలు విక్రయించాలని భావించి రూ. 5 లక్షలు తీసుకుని వరంగల్ జిల్లాను వెంకటేశ్ అనే వ్యక్తికి విక్రయించామని పేర్కొన్నాడు.
తెలంగాణలో ఐ10 న్యూస్ ఛానెల్ విజయవంతమైతే ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనూ టీవీ చానల్స్ ప్రారంభించాలన్నది నయీమ్ అభిమతమని పేర్కొన్నాడు. ఇటీవల ఓ మంత్రి పుట్టినరోజు సందర్భంగా ఆయనపై పాట తయారు చేయించి, దాని విజువల్స్ కోసం రూ. 1.50 లక్షలు నయీం ఇచ్చాడని, అయితే అనుకోని కారణాల వల్ల ఛానల్ ప్రసారాలు మొదలు కాకపోవడంతో దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు పేర్కొన్నాడు.