బద్నాం చేస్తున్నారు.. పెరిగింది ఎంతో తెలుసా?: ఘంటా అసహనం, ఇదిగో లెక్క!
బుధవారం జరిగిన సమీక్ష సమావేశం అనంతరం టీఎస్పీఎస్సీ వేతన సరళి గురించి ఆయన వివరించారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో భారీగా వేతనాలు పెరిగాయన్న ప్రచారాన్ని దాని చైర్మన్ ఘంటా చక్రపాణి తప్పుపట్టారు. మీడియాలో ఫోటోలతో సహా వార్తలు ప్రచురించి అనవసరంగా తమను బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం జరిగిన సమీక్ష సమావేశం అనంతరం టీఎస్పీఎస్సీ వేతన సరళి గురించి ఆయన వివరించారు. రూ.80వేల వేతనం ఉన్నప్పుడే అలవెన్సులతో కలిపి రూ.1.8లక్షల వరకు తమకు వేతనం వచ్చేదని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్స్ ను వర్తింపజేసిందని తెలిపారు.
ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారులు, జడ్జీలు, పీఎస్సీలకు కొత్త వేతనాలు వర్తింపజేశారని, తాజాగా ప్రభుత్వ అలవెన్సులు, బేసిక్ కలిపి గుండు గుత్తగా రూ.2.25లక్షలను చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వివరణ ఇచ్చారు.
తాజాగా పెరిగిన పే స్కేల్స్ వల్ల రూ.12నుంచి రూ.15వేల వరకే తమ వేతనాలు పెరిగాయని, ఈ విషయాన్ని పక్కనపెట్టి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో చిలువలు పలువలుగా చర్చించడం సరైంది కాదని అన్నారు.
ఇక సమీక్షా సమావేశం గురించి చెబుతూ.. ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించింది కాదని, నోటిఫికేషన్ల అనంతరం తలెత్తుతున్న సమస్యలు, నిబంధనలకు సంబంధించి జీవోలపై చర్చించడం జరిగిందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం ప్రకటించిన లక్ష ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ వేసేందుకే సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారమే తాము నోటిఫికేషన్ల ద్వారా పోస్టులు భర్తీ చేస్తామన్నారు.