హైదరాబాద్కు చేయిచ్చిన ఏపీలోని 'కడియం', ఇతర రాష్ట్రాల్లో వెతుకులాట
హైదరాబాద్: భాగ్యనగరంలో మొక్కల పెంపకం పైన జిహెచ్ఎంసి (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) అయోమయంలో పడ్డారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచి మొక్కలు వస్తాయని జిహెచ్ఎంసి ఎదురు చూసింది.
హైదరాబాదుకు కడియం నర్సరీ నుంచి 30 లక్షల మొక్కలు రావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో చేయి ఇవ్వడంతో జిహెచ్ఎంసి అయోమయంలో పడింది. వర్షాకాలంలో జిహెచ్ఎంసి పరిధిలో 40 లక్షల మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు.
ఇందుకోసం నెలల క్రితమే కడియం నర్సరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా వర్షం కురవడంతో... కడియం నుంచి మొక్కలు వస్తాయని జిహెచ్ఎంసి అధికారులు భావించారు. కానీ అలా జరగలేదు.

ఇటీవల ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చెట్టు-నీరు కింద మొక్కలను కడియం నర్సరీ నుంచే తీసుకుంది. అప్పటికి హైదరాబాదులో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కాలేదు. దీంతో, కడియం నర్సరీ యజమానులు ఏపీకి మొక్కలను సరఫరా చేశారు.
ఇప్పుడు నగరంలో వర్షాలు భారీగా కురవడం, మొక్కలు వస్తాయనుకున్న జిహెచ్ఎంసి అధికారులకు మాత్రం షాక్ తగలింది. హైదరాబాదుకు ఇప్పటి వరకు ఐదు లక్షలకు అటు ఇటుగా మొక్కలు సరఫరా చేశారు. ఇప్పుడు ముప్పై లక్షల మొక్కల విషయంలో జిహెచ్ఎంసి అయోమయపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాలని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications