గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రభంజనం: ఫలించిన కేసీఆర్ వ్యూహం, కేటీఆర్ ప్రచారం
హైదరాబాద్: 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మహా నగరానికి జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 102 స్ధానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న వార్తలు వెలువడడంతో టీఆర్ఎస్ భవన్లో పండగ వాతావరణం నెలకొంది.
భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు టపాసులతో సందడి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచార కర్త మంత్రి కేటీఆర్, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై కార్యకర్తలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందని టీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ సెంటర్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధులు ఎక్కువ స్థానాలను గెలుచుకున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రచించిన ముందస్తు వ్యూహంతో పాటు రాష్ట్ర పంచాయితీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉధ్రృతంగా సాగించిన ప్రచారం కూడా టీఆర్ఎస్ విజయానికి కారణమని అంటున్నారు.
గ్రేటర్ ప్రచారంలో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేశారు. ముఖ్యంగా ''గాడిదకు గడ్డి వేసి ఆవును పాలివ్వమంటే ఇస్తుందా.. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ను గెలిపించండి'' అన్న మాటలు కూడా ఓటర్ల మీద గట్టిగానే ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.
అంతేకాదు టీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఛాన్స్ అంటూ కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని సైతం ప్రజలు మన్నించి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారు. గ్రేటర్ ఎన్నికల్లో విశేషం ఏమిటంటే సెటిలర్లు, ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం.
గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పడం కూడా టీఆర్ఎస్ పార్టీపై ఓటర్లలలో ఒక విశ్వాసాన్ని నింపిందని చెప్పొచ్చు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకూ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేసి, సెటిలర్ల ఓట్లను కూడా రాబట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు.