గ్రేటర్ ఎన్నికలు: 'ప్లీజ్! మా గోడలు పాడు చేయొద్దు', టిడిపి పాజిటివ్ ప్రచారం
హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కువగా అధికార టిఆర్ఎస్ పార్టీల ఫ్లెక్సీలు, గోడపత్రాలు కనిపిస్తున్నాయి.
విపక్షాలకు భారీ ఫ్లెక్సీలకు చోటు లేకుండా సీఎం కెసిఆర్ చేస్తున్నారని కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు విమర్శిస్తున్నాయి. భారీ ఫ్లెక్సీలు కేవలం టిఆర్ఎస్యే కనిపిస్తున్నాయి. మెట్రో రైలు పిల్లర్లు కూడా గులాబీమయమయ్యాయి. ఈ నేపథ్యంలో చోటు ఉన్న చోటు విపక్షాలు గోడపత్రాలు వేసుకుంటున్నాయి.
నగర వ్యాప్తంగా ఆయా పార్టీల గోడపత్రాలు కనిపిస్తుంటే... సైదాబాదు డివిజన్లోని లక్ష్మీనగర్ కాలనీలో మాత్రం కాలనీవాసులు పార్టీలను హెచ్చరిస్తున్నాయి. తమ కాలనీలో ఎవరు కూడా పోస్టర్లు వేయరాదని, అలా పోస్టర్లు వేసిన వారికి ఓట్లు వేయకూడదని తమ కాలనీవాసులు నిర్ణయించినట్లుగా గోడలపై రాశారు.
అంతేకాదు, కాలనీవాసులకు కూడా కొందరు విజ్ఞప్తి చేశారు. పోస్టర్లతో గోడలను చెడగొట్టే వారికి ఓటు వేయరాదని విజ్ఞప్తి చేశారు. 'మా లక్ష్మీ నగర్ కాలనీలో గోడలకు పోస్టర్లు అంటించినా, నినాదాలు రాసినా ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయరాదని మా కాలనీవాసులు నిర్ణయించారని' గోడలపై లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాసింది.
టిడిపి పాజిటివ్ ప్రచారం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కెసిఆర్ మధ్య ప్రెండ్షిప్ కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాటిజివ్ ప్రచారం చేయాలని మెజార్టీ తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు.
తమ అభ్యర్థులను కార్పోరేటర్లుగా గెలిపిస్తే తాము ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేస్తామని, ప్రభుత్వానికి బద్ధ వ్యతిరేకంగా మాట్లాడటం తక్కువగా ఉంటుందని టిడిపి నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నారని తెలుస్తోంది.
తెరాస ప్రభుత్వం విఫలమైన అంశాలను సున్నితంగా పేర్కొంటారట. ప్రస్తుతం అధికార టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి గతంలో టిడిపి నగర మేయర్గా పని చేశారు. ఆ సమయంలో తాము ఏం చేశామో చెబుతామంటున్నారు.