హోటల్లో తనిఖీలు
హైదరాబాద్: బిర్యానీలో కుక్కమాంసం కలుపుతున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాయదుర్గం ఠాణాకు సమీపంలో ఉండే షా గౌస్ హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ మూర్తిరాజు, వెస్ట్జోన్ వెటర్నీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వకీల్, సర్కిల్-11 ఏఎం హెచ్ఓ డాక్టర్ రవికుమార్, డాక్టర్ రంజిత్ హోటల్ కు చేరుకుని ఆహార పదార్థాలను పరిశీలించారు. శాంపిల్స్ను సేకరించి నాచారంలోని స్టేట్ ఫుడ్ లేబరేటరీకి పంపించారు. అనంతరం హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. కాగా, తాము 25 ఏళ్లుగా హోటల్ బిజినెస్ లో ఉన్నామని, 15 సార్లు ఉత్తమ హోటల్ అవార్డులను స్వీకరించామని హోటల్ యజమాని రబ్బానీ విలేకరులతో పేర్కొన్నారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు సృష్టించిన ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తమ హోటల్పై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలపై సైబర్ క్రైం విభాగంలోనూ, రాయదుర్గం ఠాణాలోనూ ఫిర్యాదు చేశామన్నారు.