శంషాబాద్ ఎయిర్పోర్టులో యాడ్ ఫిల్మ్ కోసం వెళ్లిన యువతి అదృశ్యం
నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన యువతి తండ్రి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ విజయ్నగర్కాలనీలో ఉండే కేజేసీఎక్స్ కోటేశ్వరరావు కూతురు షణ్ముకప్రియ(18) అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తోంది. ఆమె ఒక యాడ్ తీసేందుకు డార్జిలింగ్కు వెళ్తానని చెప్పడంతో ఆగస్టు 17న శంషాబాద్ ఎయిర్పోర్టులో తండ్రి దిగబెట్టి వెళ్లారు.
అయితే, ఆగస్టు 28నే తిరిగి వస్తానని చెప్పిన షణ్ముకప్రియ తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు. షణ్ముకప్రియ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే శంషాబాద్ ఆర్టీఐఏ పోలీస్ స్టేషన్కు అందించాలని పోలీసులు కోరారు.