ప్రేమకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను చంపబోయిన అమ్మాయి
మెదక్: తన ప్రేమకు తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని భావించిన ఓ కూతురు అన్నంలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులను చంపడానికి ప్రయత్నించింది. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడలో జరిగింది.
కుకునూరుపల్లి ఎస్ఐ రామకృషారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిషన్, అన్నపూర్ణలు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో మందలించారు. అయినా వారు ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా తన ప్రేమకు తల్లిదండ్రులే అడ్డుగా ఉన్నారని భావించిన అన్నపూర్ణ అన్నంలో నిద్ర మాత్రలను కలిపింది.

ఇది గమనించని ఆమె తండ్రి మల్లయ్య రోజూ మాదిరిగానే భోజనం చేశాడు. కొద్దిసేపటి తర్వాత మల్లయ్యకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో అతన్ని సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న మల్లయ్య తన కూతురు అన్నపూర్ణ, ఆమె ప్రియుడు కిషన్ లు కలిసి నిద్ర మాత్రలను ఇచ్చి తమను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదుపై పోలీసులు అన్నపూర్ణ, కిషన్లపై కేసు నమోదు చేశారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కుట్ర పన్ని తనపై నింద వేస్తున్నారని కుటుంబసభ్యులకు తెలిపిన కిషన్ తన ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, తానే ఆత్మహత్య చేసుకొనేందుకు ఇల్లు వదిలి పోతున్నానని లేఖ రాసిపెట్టిన కిషన్ కనిపించకుండా పోయాడని అతని తల్లి పోలీసులకు ఉత్తరాన్ని అందజేసింది.












Click it and Unblock the Notifications