ఇంట్లోంచి ఎత్తుకెళ్లి రాత్రంతా రేప్ చేసి, తెల్లారి వదలేశారు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన ఓ బాలిక(14)ను ఆమె ఇంట్లోంచి జూన్ 28న అపహరించిన నలుగురు యువకులు రాత్రంతా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
మర్నాడు తెల్లారి వదిలేశి వెళ్లారు. ఆ దారుణానికి బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురై, చివరకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుల్లో ఇద్దరిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. మిగతా ఇద్దరి గురించి ఎలాంటి సమాచారం వెల్లడించ లేదు.
స్థానికులు అందించిన వివరాల ప్రకారం- కథలాపూర్ మండలం దూలూరుకు చెందిన పడాల శ్రీకాంత్, మన్నెగూడెంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఓ ఆర్ఎంపీ వద్ద కంపౌండర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినిని కొన్నిరోజులుగా ప్రేమ పేరిట వేధిస్తూ వస్తున్నాడు.
ఆమె అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. బాలిక తండ్రి మృతిచెందడంతో తల్లి, నానమ్మ చెంత బాలిక ఉంటున్న విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు యువకులతో కలిసి రాత్రి కారులో వచ్చాడు. అందరూ కలిసి ఇంట్లోకి దూరి అడ్డం వచ్చిన ఆమె తల్లి, నానమ్మపై దాడి చేసి బాలికను ఎత్తుకెళ్లారు.
రాత్రి అత్యాచారానికి పాల్పడి మర్నాడు ఉదయం ఇంటి వద్ద వదిలి వెళ్లారు. కొందరు గ్రామపెద్దల సహాయంతో స్థానిక పోలీస్స్టేషన్కు బాధిత బాలిక కుటుంబ సభ్యులు వెళ్లి ఫిర్యాదు చేశారు.
అయితే, పోలీసుల వాదన మరో విధంగా ఉంది. రాత్రి బాలికను అపహరించుకు వెళ్లిన శ్రీకాంత్, తాను పనిచేస్తున్న ఆర్ఎంపీ ఇంట్లో నిర్బంధించాడనీ, అతడికి సహకరించిన మరో యువకుడు చెన్నమనేని శ్రావణ్రావు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనీ, మరుసటి రోజు ఉదయం బాలికను ఇంటివద్ద వదిలి పారిపోయారని చెబుతున్నారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్, శ్రావణ్రావుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి ఎస్ఐ రవి, కోరుట్ల సీఐ రాజశేఖర్రాజు తెలిపారు.