గొంతు, మణికట్టు కోసి అత్యంత దారుణంగా బాలికను హత్య చేశారు
హైదరాబాద్: కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏడేళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారు. పట్టపగలే దుండగులు బాలిక గొంతు, మణికట్టు కోసి అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట గ్రామంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణమూర్తి, భవానీ దంపతులు 2006లో బతుకుదెరువు కోసం ఎల్లంపేటకు వలస వచ్చారు. కృష్ణమూర్తి కారు డ్రైవర్గా పనిచేస్తుండగా, భవానీ గ్రామానికి సమీపంలో ఉన్న మైక్రో సీడ్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు కావ్యశ్రీ(9), హిందూ శ్రీ సాయిలక్ష్మి ప్రసన్న(7). మేడ్చల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. కృష్ణమూర్తి, భవానీ దంపతులు యథావిధిగా బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో విధుల్లోకి వెళ్లిపోయారు.
దసరా సెలవులు ఇంకా పూర్తి కాకపోవడంతో కూతుళ్లు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. కాగా మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వారి ఇంటి పక్కన ఉండే భవానీ చెల్లెలు వెంకటలక్ష్మి పిల్లలను చూసేందుకు వచ్చింది. ఆ సమయంలో కావ్యశ్రీ ఇంట్లో పడుకొని ఉంది.
సాయి ప్రసన్న గురించి అడుగ్గా బయటికి వెళ్లిందని ఆమెతో చెప్పింది. సాయి ప్రసన్న కోసం బయటకు వెళ్లే క్రమంలో బాత్రూం వైపు వెళ్లగా రక్తం మడుగులో పడి ఉంది. గొంతు, మణికట్టు కోసి కొన ఊపిరితో ఉన్న బాలికను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు.
ఆటోలో కొద్ది దూరం వెళ్లగా మార్గం మధ్యలో సాయి ప్రసన్న మృతి చెందింది. బాలిక హత్య గురించి తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఎల్లంపేటకు చేరుకొని విచారణ ప్రారంభించారు. డాగ్స్కాడ్ను రప్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.