దత్తత-అభివృద్ధి: గోల్కొండపై జీఎంఆర్, చార్మినార్పై ఐటీసీ కన్ను
హైదరాబాద్: చారిత్రక, వారసత్వ కట్టడాల దత్తత అభివృద్ధి పథకం కింద ఇప్పటికే దేశ రాజధానిలోని ఎర్రకోటను దాల్మియా గ్రూప్ దత్తత తీసుకోగా.. 400ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్లోని చారిత్రక నిర్మాణాలు గోల్కొండ కోట, చార్మినార్ను దత్తత తీసుకునేందుకు రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి.

చార్మినార్పై ఐటీసీ కన్ను
ఐటీసీ హోటల్స్ ఇప్పటికే చార్మినార్ దత్తత విషయంలో కేంద్రానికి లేఖ రాసింది. ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన దత్తత కమిటీకి దరఖాస్తును పంపింది.

గోల్కొండ కోటపై జీఎంఆర్..
ఇదే సమయంలో గోల్కొండ కోటను దత్తత తీసుకునేందుకు జీఎంఆర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్య సంస్థ) ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. దాల్మియాతోపాటు ఎర్రకోట దత్తతకు తాము కూడా దరఖాస్తు చేశామని, కానీ, షార్ట్ లిస్ట్ తర్వాత దాల్మియానే ఎంపిక చేశారని చెప్పారు. అయితే, గోల్కొండ కోట తమకు దక్కుతుందనే భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దాల్మియాకు ఎర్రకోట
ఐదేళ్ల కాలానికి ఎర్రకోటను దాల్మియా భారత్ గ్రూపు దత్తత తీసుకుంది. రూ.25 కోట్ల విలువైన కాంట్రాక్టును ఓ కార్పొరేట్ సంస్థకు అప్పగించడం ఇదే ప్రథమం. ఈ కాంట్రాక్టు దక్కించుకోవడం ద్వారా దాల్మియా భారత్ గ్రూపు ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన 17వ శతాబ్దానికి చెందిన ఎర్రకోట కట్టడం నిర్వహణ, పునరుద్ధరణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇండిగో ఎయిర్లైన్స్, జీఎంఆర్ గ్రూప్లతో పోటీపడి ఈ కాంట్రాక్టును దాల్మియా గ్రూపు దక్కించుకుంది.

93 వారసత్వ కట్టడాలు
కాగా, దేశంలోని 93 వారసత్వ కట్టడాల అభివృద్ధికి కేంద్ర పర్యాటకశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా వారసత్వ స్థలం ఎర్రకోట అభివృద్ధి కాంట్రాక్ట్ను అడాప్ట్ హెరిటేజ్ సైట్ పథకం కింద ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, టూరిజం శాఖలతో దాల్మియా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లపాటు ఏడాదికి 5 కోట్ల రూపాయల చొప్పున ఆ సంస్థ పర్యాటకశాఖకు చెల్లించనున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై కేంద్ర టూరిజం శాఖ స్పందించింది. గత ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు రాష్ట్రపతి ఈ పథకాన్ని ప్రకటించారు. చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే దాల్మిక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చాం.. కేవలం వారసత్వ కట్టడాల అభివృద్ధి కోసమే ఇందుకు శ్రీకారం చుట్టామని, ఇందులో ఎలాంటి లాభాపేక్షలేదని ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక దత్తత జాబితాలో గోల్కొండ, చార్మినార్లు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications