రైతులకు, 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాకు వెల్లడించారు. అర్హులైన పేదలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అంతేగాక, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4.56 లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరికొన్ని గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం. 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మినిమం టైం స్కేల్తో 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేశామన్నారు.
జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతుందని, వంద రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీ సూచన చేసినట్లు తెలిపారు. ఇక భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రులు తెలిపారు.












Click it and Unblock the Notifications