మహిళలకు శుభవార్త.. కుట్టు మిషన్ల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశం!
తెలంగాణా రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలని తెలంగాణా సర్కార్ సంకల్పించింది. ఈ క్రమంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల పథకం వేగవంతం కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
బీసీలకు కుట్టుం మిషన్ల పథకం కింద ఇప్పటికే సుమారు 1.80లక్షల దరఖాస్తులు
హైదరాబాద్లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పథకాలు, కీలక అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను ఈ నెల 7వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ పథకం కింద ఇప్పటికే సుమారు 1.80లక్షల దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ గడువు 15వ తేదీ వరకు కొనసాగుతుందని గుర్తు చేశారు. అర్హులైన మహిళలకు త్వరితగతిన కుట్టుమిషన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

కళ్యాణ లక్ష్మీ పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి: మంత్రి పొన్నం ఆదేశం
ఇదే సమయంలో కల్యాణలక్ష్మి పథకంపై హైకోర్టు విధించిన స్టే ఇటీవల ఎత్తివేయడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కూడా మంత్రి ఆదేశించారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 327 గురుకులాలు ఉన్నాయని, వాటిలో కేవలం 22 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన గురుకులాలకు అవసరమైన స్థలాలు, భవనాల వివరాలపై సమగ్ర నివేదికను ఈ నెల 15లోగా సమర్పించాలని ఆర్సీవోలను ఆదేశించారు.
దోభీ ఘాట్ ల ఏర్పాటుకు ఆదేశం
ప్రతి గ్రామంలో గీత కార్మికుల రక్షణ కోసం కనీసం 10 రక్షణ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సూచించారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక దోబీ ఘాట్ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తొలి దశలో హుస్నాబాద్, హుజూరాబాద్, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో ఈ ఘాట్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం చేపట్టిన పథకాలు సకాలంలో ఫలితాలు ఇచ్చేలా పని చెయ్యాలన్న మంత్రి
బీసీ సంఘాల సంక్షేమం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు సకాలంలో ఫలితాలు ఇచ్చేలా పని చెయ్యాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అధికారులు ఈ ఆదేశాలను సక్రమంగా అమలు చేస్తే లక్షలాది మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications