షాకింగ్ నిర్ణయం: వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్కు కేటాయించిన గవర్నర్, ఏ శాఖా లేని మంత్రి ఈటల
హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సర్కారు సిఫార్సు మేరకు మంత్రి ఈటల రాజేందర్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్కి కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖ సీఎంకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు.
అంతకుముందు పరిణామాలు ఇలా..
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రిపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సీఎం కేసీఆర్.. వెంటనే విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగచూసినట్లు తెలుస్తోంది.

మెదక్ జిల్లా అచ్చంపేటలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శనివారం ఉదయం విచారణ ప్రారంభించారు. మంత్రిపై ఆరోపణలు చేసిన బాధితులు, రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ శుక్రవారం సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఆదేశాలతో అధికార గణం కదిలారు. విచారణలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్ పాల్గొన్నారు.
అచ్చంపేటలో తూప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటల రాజేందర్ కు చెందిన హేచరీస్ డిజిటల్ సర్వే కొనసాగిస్తున్నారు. దీంతోపాటు హేచరీస్కు పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లోనూ అధికారులు డిజిటల్ సర్వే చేపట్టారు.

కాగా, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. భూకబ్జాకు సంబంధించిన వివరాలున రైతులను అడిగి తెలుసుకున్నారు. మూసాపేట తహసీల్దార్ కార్యాలయంలో భూముల రికార్డులను పరిశీలించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు.












Click it and Unblock the Notifications