అంతా సిద్ధం: మెట్రో రైల్లో ప్రయాణించిన గవర్నర్, కేటీఆర్(పిక్చర్స్)
నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మెట్రో రైలు పనులను పరిశీలించారు.
హైదరాబాద్: నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మెట్రో రైలు పనులను పరిశీలించారు. మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్ మెట్రోస్టేషన్లో మెట్రో రైలెక్కి మియాపూర్ మెట్రోస్టేషన్ వరకు ప్రయాణం చేశారు. అక్కడ మెట్రో పరిసర ప్రాంతంలో జరుగుతున్న మెట్రో సుందరీకరణ పనులను పరిశీలించారు.
పనుల పురోగతి..
మెట్రో ప్రాజెక్టు పనులను గవర్నర్ నర్సింహన్, మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ మెట్రో ప్రయాణంలో చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, మున్సిపల్ సెక్రటరీ నవిన్ మిట్టల్ కూడా ఉన్నారు.
బేగంపేట-అమీర్పేట..
హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు సోమవారం రోజున మెట్రో పనులను సమీక్షించారు. బేగంపేట, ఎస్ఆర్ నగర్ మధ్య ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ పనులను ఆయన ఆరా తీశారు. అమీర్పేట వద్ద ఓఈటీఎస్ పనులకు ఆయన ఆమోదం కూడా తెలిపారు. బుధవారం బేగంపేట నుంచి అమీర్పేట మధ్య ట్రయల్ రన్ నిర్వహించారు.
అంతా సిద్ధం
నవంబర్ 15 నాటికి మెట్రో రైల్ ప్రారంభానికి రెడీ అవుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నవంబర్ 28న మెట్రోరైల్ను ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరామన్నారు. ప్రపంచ భాగస్వామ సదస్సు ప్రారంభానికి ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైల్ ప్రారంభంపై ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు.
ఈ మెట్రో విభిన్నం..
మెట్రో రైలు ప్రాజెక్టులో ఇంటర్ చేంజ్ స్టేషన్ల నిర్మాణం పూర్తిగా భిన్నమైంది. రెండు వేర్వేరు కారిడార్లను కలిపే జంక్షన్ ఈ ఇంటర్ చేంజ్ స్టేషన్. ఉదాహరణకు నాగోల్ నుంచి మియాపూర్ వెళ్లాల్సిన వ్యక్తి ఒకే మెట్రో రైల్లో వెళ్లలేడు. కచ్చితంగా అమీర్పేటలో దిగి రైలు మారాల్సిందే.
ఒకేసారి నాలుగు మెట్రో రైళ్లు..
ఇక్కడే, ఒకవైపు నుంచి వచ్చిన రైలు రెండో అంతస్తులో.. మరో వైపు నుంచి వచ్చిన రైలు మూడో అంతస్తులో ఆగుతాయి. ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాల ఆధారంగా రైళ్లు మారాల్సి ఉంటుంది. అందుకే వీటిలో, ఒకేసారి నాలుగు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించేలా నిర్మాణాలు ఉంటాయి.
ఒకేసారి 30వేల మంది
ప్రతి మెట్రో స్టేషన్ రెండంతస్తులు ఉంటే.. ఇంటర్ చేంజ్ స్టేషన్ మాత్రం మూడంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తు పూర్తిగా టికెటింగ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్! అయితే, రెండు, మూడు అంతస్తుల్లో ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దీనిని 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. అమీర్పేట ఇంటర్ చేంజ్ స్టేషన్ పొడవు 476 అడుగులు. కాగా, వెడల్పు 148 అడుగులు. భూమి నుంచి స్టేషన్ పైకప్పు ఎత్తు 112 అడుగులు. ఇక్కడి నుంచి ఒక్క రోజులో 30 వేల మంది ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 6 వేలమంది స్టేషన్లో ఉండేలా విశాలంగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇతర నిర్మాణాలను శరవేగంగా రూపుదిద్దుతున్నారు. మొదటి అంతస్తులో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లు, టికెట్లు ఇచ్చే రూంలు ఉంటున్నాయి. ఈ స్టేషన్ ప్రత్యేకంగా ఉండేందుకు ఆకట్టుకునే గ్రానైట్ రాళ్లతో సుందరీకరణ జరుగుతోంది.
అమీర్పేటలో మాత్రం..
సాధారణంగా మెట్రో రైళ్లు ఆయా స్టేషన్లలో కేవలం 20 సెకన్లు మాత్రమే ఆగుతాయి. కానీ, అమీర్పేట ఇంటర్ చేంజ్ స్టేషన్లో మాత్రం 2 నిమిషాలకుపైగా ఆగనున్నాయి. మియాపూర్ నుంచి నాగోల్కు వెళ్లాల్సిన వ్యక్తి ఒకే మెట్రో రైల్లో వెళ్లలేడు. అమీర్పేటలో దిగాలి. అలా దిగిన ప్రయాణికుడు నాగోల్ వెళ్లాలంటే మరో అంతస్తుకు వెళ్లాల్సిందే. మెట్రో స్మార్ట్ కార్డు ఉన్న ప్రయాణికుడే నేరుగా రెండు, మూడు అంతస్తులకు వె ళ్లగలుగుతాడు. కానీ, మామూలు టికెట్ తీసుకున్న వ్యక్తిని మళ్లీ టికెట్ తీసుకుంటేనే మరో అంతస్తులోకి అనుమతిస్తారు. అందుకే ఇక్కడ 2 నిమిషాలు ఆపుతారు.
ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా..
మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అనేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పాదచారులకు ప్రత్యేక మార్గాలు ఉంటాయి. అలాగే, సర్వీస్ లేన్స్, బస్సు, ఆటోల కోసం ప్రత్యేక మార్గాలు ఉంటాయి. స్టేషన్లలోకి వచ్చేందుకు, స్టేషన్లలో దిగిన తర్వాత సంజీవరెడ్డినగర్, పంజాగుట్ట, యూసఫ్గూడ, మైత్రీవనం, గ్రీన్లాండ్స్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆయా ప్రాంతాల్లో పార్కింగ్, స్కైవేలను ఏర్పాటు చేస్తారు.
సౌకర్యాలెన్నో..
ఇక్కడ 12 ఎస్కలేటర్లు, 16 లిఫ్టులు, 12 మెట్ల మార్గాలు ఉంటాయి. ఒక కారిడార్లో దిగిన ప్రయాణికులు మరో కారిడార్లోకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు స్కైవేలు, మెట్ల మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్లాట్ఫామ్ దిగిన ప్రయాణికుడికి బయటికి వెళ్లే మార్గం, రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలు ఎల్ఈడీ డిస్ప్లే విధానంలో ప్రదర్శిస్తారు. దాదాపు అన్ని మెట్రో స్టేషన్లు కూడా బస్టాప్లకు సమీపంలోనే ఉండేలా చూసుకుని నిర్మించడం గమనార్హం.