తెలంగాణా బడ్జెట్ సమావేశాల వేళ.. యాదాద్రి లక్షీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
తెలంగాణా బడ్జెట్ సమావేశాల వేళ యాదాద్రి లక్షీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై అందరికీ బెస్ట్ విషెస్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఇక ఈ క్రమంలో ఈరోజు ఉదయం గవర్నర్ తమిళిసై యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
నేడు యాదగిరిగుట్టకు వెళ్లిన గవర్నర్ తమిళిసై కి యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గవర్నర్ తమిళిసై. ఆపై ఆలయ పండితులు గవర్నర్ తమిళి సై కి మహదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆపై అక్కడనుండి మీడియాతో మాట్లాడకుండా గవర్నర్ వెళ్లిపోయారు. అందరికీ బెస్ట్ విషెస్ అంటూ చెప్పిన గవర్నర్ ఇక యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత నేరుగా రాజభవన్ కు తిరిగి వెళ్లారు. ఇక మరికొద్ది సేపట్లో గవర్నర్ తమిళి సై తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్ళనున్నారు.
ఈరోజు శాసనసభకు గవర్నర్ రానున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక వాహనశ్రేణి ముందుకు కదులుతుండగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శాసనసభకు చేరుకుంటారు. శాసనసభలో మధ్యాహ్న సమయంలో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. అయితే చాలా కాలంగా గవర్నర్ తమిళి సై కి తెలంగాణా ప్రభుత్వానికి మధ్య రగడ కొనసాగుతున్న నేపధ్యంలో నేడు తమిళి సై ప్రసంగం ఎలా ఉంటుంది అన్నది ప్రతీ ఒక్కరిలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.