తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పీడ్ పెంచాలి: గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పీడ్ పెంచాలని గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువుల తల్లి సరస్వతి ఇప్పుడు లక్ష్మీ దేవిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఓసారి విద్యా వ్యవస్థ వైపు చూడాలన్నారు. ప్రభుత్వం ఇంకా స్పీడు పెంచాలన్నారు.
ఇప్పటికే రెండేళ్లు గడిచాయన్నారు. మన విద్యావిధానంలోనే లోపం ఉందన్నారు. హైదరాబాదులో తెలంగాణ జాగృతి నిర్వహించిన స్కిల్ డెవలెప్మెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమన్నారు.
నైపుణ్య శిక్షణ విద్యలో ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. కేవలం విద్యను అభ్యసించినందువల్లే ఉద్యోగాలు రావన్నారు. నైపుణ్యం లేకపోతే ఉద్యోగాలు రావని, అందుకే ఈ దిశగా సమాజంలో చైతన్యం రావాలన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు కూడా అటెండర్లుగా పని చేస్తున్నారన్నారు.
స్వార్థంతో విద్యను వ్యాపారం చేశారన్నారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ పై మన వ్యవస్థ విఫలమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పి, గ్రామీణ విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ చేయాలన్నారు.