కేసీఆర్ ప్లాన్ ఫలించలేదు: 25 అనుకుంటే 5 కష్టమే!
హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పర్చుకున్న మధ్య తరగతి ప్రజలనుంచి డబ్బులు రాబట్టుకొని వాటిని క్రమబద్ధీకరించడం, అలాగే ప్రభుత్వ ఖాళీ స్థలాలను వేలం వేయడం ద్వారా 25 వేల కోట్ల నిదులు సమీకరించుకోవాలనుకున్న తెలంగాణ ప్రభుత్వ అంచనాలు ఫలించే అవకాశం కనిపించడం లేదంటున్నారు.
మరో మూడ్నాలుగు రోజుల్లో క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువు తీరిపోనుంది. 19తో గడువు తీరనుంది. అయినప్పటికీ ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం వేసుకున్న అంచనాల్లో ఐదో వంతు అంటే 5 వేల కోట్లు కూడా సమకూరే అవకాశం కనిపించడం లేదంటున్నారు.
125 గజాల వరకు ఆక్రమించుకొని నివాసాలు ఏర్పర్చుకున్న దారిద్రరేఖకు దిగువనున్న పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించడం, అలాగే దారిద్రరేఖకు ఎగువనున్న మధ్య తరగతి ప్రజలకు కొంత మేరకు వెసులుబాటు ధరతో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ భావించింది. ఈ మేరకు ఉచిత క్రమబద్ధీకరణకు జీవో నంబర్ 58, డబ్బులు చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు జీవో నంబర్ 59ని ప్రభుత్వం ఏకకాలంలో జారీ చేసింది.
ఈ రెండు అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా కేసీఆర్ స్వయంగా ప్రజలకు పిలుపునిచ్చారు. వీటిలో ఉచిత క్రమబద్ధీకరణకు జనం ఎగబడినప్పటికీ, డబ్బులు చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు మాత్రం జనం ముందుకు రావడం లేదంటున్నారు.

ప్రభుత్వ ఆక్రమణ స్థలం 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం, 250 నుంచి 500 గజాల వరకు 75 శాతం, 500 గజాలకు పైబడిన స్థలాలకు 100 శాతం రిజిస్ట్రేషన్ విలువ మేరకు చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు ధరలు మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా ఉండటం వల్లనే దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు రావడం లేదంటున్నారు.
ప్రభుత్వ భూముల ఆక్రమించుకున్న కాలాన్ని పరిగణనలోకి తీసుకొని క్రమబద్ధీకరణకు ఫీజులు ఖరారు చేసి ఉంటే ప్రజల నుంచి స్పందన ఉండేదని, అలా కాకుండా పాతిక సంవత్సరాల కిందట ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిని, ఆరు నెలల కిందట ఆక్రమించుకున్న వారిని ఒకే గాటన కడుతూ రిజిస్ట్రేషన్ విలువను ఖరారు చేయడం వల్లనే ప్రజానీకం ముందుకు రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ స్థల ఆక్రమణ కాలాన్ని 15, 10, 5, 1 సంవత్సరాలుగా నాలుగు విభాగాలుగా గుర్తించి రిజిస్ట్రేషన్ విలువలో 25, 50, 75, 100 శాతాలుగా ఖరారు చేసి ఉంటే ప్రజల నుంచి స్పందన ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో భూముల ధరలు బాగా పడిపోయాయని, గతంలో ప్రభుత్వాలు ఖజానా నింపుకోవడానికి రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రతి రెండేళ్లకోసారి పెంచడం వల్ల ప్రస్తుతం మార్కెట్ ధరకు, రిజిస్ట్రేషన్ చార్జీలకు మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించకపోవడం కూడా క్రమబద్ధీకరణకు ప్రజలు ఆసక్తి కనబర్చకపోవడానికి కారణమంటున్నారు.












Click it and Unblock the Notifications