ఉన్న ఇల్లు కూల్చేశారు-ఒంటి మీద బట్టలే మిగిలాయి-ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి : రేపిస్ట్ రాజు ఫ్యామిలీ
రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా అతని కుటుంబ సభ్యులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్న ఒక్క దిక్కును కోల్పోయామని తమకూ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. రాజు భార్య మౌనిక,అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.రాజు ఆత్మహత్య చేసుకోలేదని.... పోలీసులే చంపేశారని ఆరోపించారు. రాజు ఆత్మహత్య వార్త వెలుగుచూశాక ఈ ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.
రాజు తల్లి ఏమన్నారు...
'ఆదివారం నాడే దొరికిండని చెప్పినరు సారూ... దొరికితే ఎన్కౌంటర్ చేయాలని పైనుంచి ఆర్డర్ వచ్చిందని వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాం.మాతో సంతకాలు చేయించుకున్నారు.రాత్రి 10గంటలకు మమ్మల్ని ఉప్పల్లో వదిలి వెళ్లారు.హైదరాబాద్ సైదాబాద్లో రూ.1,50,000 పెట్టి ఇల్లు కొనుకున్నాం.ఉన్న ఇల్లు కూల్చేశారు.ఒంటి మీద బట్టలు తప్ప ఊళ్లో మాకంటూ ఏమీ లేదు.శవాన్ని దానం చేసేందుకు కూడా డబ్బులు లేవు. ఇప్పుడు నా కడుపు కూడా కాలినట్లే కదా సారూ... మా కొడుకును చంపేసినందుకు మాకు కూడా న్యాయం చేయాలి.' అని రాజు తల్లి డిమాండ్ చేశారు.
ఇప్పుడు మాకు దిక్కెవరు : రాజు భార్య
'శుక్రవారం(సెప్టెంబర్ 10) హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి.. నన్ను, మా అత్తమ్మ, మా ఆడబిడ్డను,ఆమె భర్తను వెంట తీసుకెళ్లారు.బయట ఉంటే మీపై దాడి జరగొచ్చు లేదా చంపేసే ప్రమాదం ఉందని... మీ భద్రత కోసమే తీసుకొచ్చామని చెప్పారు. రాజును వెతికేందుకు మమ్మల్ని కూడా వెంట తీసుకెళ్లారు. రాజు దొరికితేనే పంపిస్తామన్నారు.మాతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని.. బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ చౌరస్తాలో వదిలివెళ్లారు. రాజు దొరికిండా అని అడిగితే ఏం చెప్పలేదు.అక్కడి నుంచి మేం భువనగిరికి బస్సులో వచ్చి.. ఓ బండి మాట్లాడుకుని గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అడ్డగూడూరుకు చేరుకున్నాం. కొద్దిగంటల్లోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. నా భర్తను పోలీసులే చంపేశారు. కోర్టుకు అప్పగిస్తే శిక్ష అనుభవించేవాడు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగితే.. మరి మా కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. నాకు 11 నెలల కూతురు ఉంది. ఇప్పుడు మాకు దిక్కెవరు.' అని మౌనిక వాపోయింది.
డెడ్బాడీని అప్పగించండి : రేపిస్ట్ రాజు భార్య
'రాఖీ పౌర్ణమికి ఇద్దరం కలిసి మా పుట్టింటికి వెళ్లాం.అక్కడ రాజు మా అమ్మతో గొడవ పెట్టుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు.వెళ్లేందుకు డబ్బులు లేక నేను అక్కడే ఉండిపోయాను.హైదరాబాద్ వెళ్లాక తల్లితోనూ గొడవపడి ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.ఇంతలోనే ఇలా జరిగిందని తెలిసింది.' అంటూ మౌనిక చెప్పుకొచ్చింది. రాజు డెడ్ బాడీని తమకు అప్పగించాలని మౌనిక కోరారు. లేకపోతే తాను కూడా చనిపోతానని కన్నీరుమున్నీరైంది.
రైల్వే ట్రాక్పై రాజు ఆత్మహత్య...
స్టేషన్ ఘన్పూర్-వరంగల్ మధ్య నష్కల్ సమీపంలో రైల్వే ట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రైల్వేట్రాక్పై రాజు శవాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చేతిపై మౌనిక అనే పేరుతో టాటూ గుర్తించిన పోలీసులు ఆ మృతదేహం రాజుదేనని నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా అతని కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండటంతో... ఇక తప్పించుకోలేని పరిస్థతుల్లో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించే అవకాశముంది.
రాజు అత్తమ్మ రియాక్షన్...
తన బిడ్డ బతుకు ఆగమైపోయిందని మౌనిక తల్లి యాదమ్మ వాపోయింది. సూర్యాపేట జిల్లా తిరు మలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాజు తమ బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది.గత శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి తన భర్తను, ఇద్దరు కొడుకులను, బిడ్డను తీసుకుని వెళ్లారని తెలిపింది. బుధవారం రాత్రి పంపించారని... తెల్లారే సరికి రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని పేర్కొంది. తన బిడ్డకు ఓ పాప ఉందని... ఆమె బతుకు ఏమైపోవాలని వాపోయింది. ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరింది.
భారీ సెర్చ్ ఆపరేషన్...
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ప్రాణం తీసిన రాజు కోసం తెలంగాణ పోలీసులు మునుపెన్నడూ లేనంత భారీస్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ మొత్తంగా 1000 మంది పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. అతడు నల్గొండ జిల్లాలో ఉన్నాడని, మరోచోట ఉన్నాడని ప్రచారం జరిగింది. రాజు ఎన్కౌంటర్ కావడం పక్కా అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అయితే పోలీసులకు చిక్కి ఎన్కౌంటర్ కావడం కంటే తనకు తానే ప్రాణాలు తీసుకోవడం మేలని ఆలోచించే రాజు బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
గత గురువారం జరిగిన ఘటన
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి గత గురువారం (సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే పోలీసులు క్లూస్ టీమ్ పలు వివరాలు సేకరించారు.