తెలంగాణా మహిళలకు అదిరిపోయే శుభవార్త.. మహిళాసంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు!
మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే మహిళలకు ఉపాధి కల్పించడానికి పలు నిర్ణయాలను తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం రైల్వే స్టేషన్ లో మహిళా సంఘాల ఉత్పత్తులకు స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకొని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు
ఇందులో భాగంగా మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులను ఇవ్వనుంది. ఆ తరువాత మిగిలిన మండల సమాఖ్యలకు కూడా 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీనికోసం ప్రతి నెల ఒక్కొక్క ఆర్టీసీ అద్దె బస్సు కు అద్దె రూపంలో 77,220 రూపాయలను చెల్లించనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇక బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేశంలోనే తొలిసారి
దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులను నిర్వహించాలనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 8వ తేదీన హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఇందులో భాగంగా 50 బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు.
సీఎం చేతుల మీదుగా మహిళా దినోత్సవం నాడు ప్రారంభం
మొదటి విడతలో 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభిస్తారు. మొదటి దశలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలలో మహిళ సంఘాలకు ఆర్టీసీ బస్సులను కేటాయిస్తారు. మహబూబ్నగర్, కరీంనగర్ లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసే ఈ 150 బస్సులను నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు.
మహిళాసంఘాల పేరుతో బస్సులు కొని, ఆర్టీసీలో అద్దెకు
దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించి ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. బస్సుల కొనుగోలు ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు మొదలైన అంశాల పైన సమగ్ర నివేదికను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ నేపథ్యంలో ఇందులో భాగంగా మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలని, వారు కొనుగోలు చేసే బస్సులను అద్దెకు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications