ఆకుపచ్చ నగరం.!ఎటు చూసినా సస్యశ్యామలమే.!స్వచ్చమైన ఆరోగ్యం కోసం జీహెచ్ఎంసీ పార్కుల ఏర్పాటు.!
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు, సుందరీకరణ, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తోంది. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను పెంపొందించడం పట్టణ పార్క్ ల ముఖ్య ఉద్దేశం. పెరుగుతున్న వాహన, పరిశ్రమల కాలుష్యం వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవించి, ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గుదల మూలంగా వాతావరణ సమతుల్యత లేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్దితులను అదిగమించేందుకు నగర పాలక సంస్ధ వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.
నగర వాసులకు ఆరోగ్యకరమైన వాతావరణం.. పచ్చని పార్కుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం
ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా అటవీశాఖ, జిహెచ్ఎంసి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పట్టణ అటవీ పార్కులను ముమ్మరంగా ఏర్పాటు చేసేందుకు ణాళికలు రూపొందిస్తున్నారు.పట్టణ అటవీ పార్కుల ఆహ్లాదకరంగా అందరినీ ఆకట్టుకునే విధంగా తీర్చి దిద్దడంతో పాటుగా పర్యాటక అభివృద్ధి కూడా ప్రత్యామ్నాయ మార్గంగా భావించిన అధికారులు ఆ దిశగా అభివృద్దిపనులకు శ్రీకారం చుడుతున్నారు.
వివిధ రకాల పేర్లతో పార్కులు ఏర్పాటు.. ఆహ్లాదాన్ని పంచడమే లక్ష్యం
హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ప్రాంతంలో పట్టణ పార్కులను వివిధ రకాల పేర్లతో ఏర్పాటు చేసి, అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించడం జరుగుతుంది.గాజుల రామారం, సూరారం, బైరాంపేట్ పరిధిలో 454 హెక్టార్ లలో అటవీ ప్రాంతంలో గాజులరామారం లోని 60 ఎకరాల్లో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో అన్ని హంగులతో మెరుగైన వసతులు ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు. ఆకర్షణీయంగా ముఖ ద్వారం ఏర్పాటు చేశారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, వాష్ రూమ్స్, యోగ షెడ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండు ఓపెన్ క్లాస్ రూలు, పిక్నిక్ ఏరియా ఏర్పాటు చేశారు.
పార్కులు ఎక్కువగా ఉంటే ఉష్షోగ్రతల్లో మార్చు.. చల్లదనంతో నిండిన నగర వాతావరణం
అభివృద్ది చేసిన పచ్చదనం స్థానిక ఉష్ణోగ్రతలను 2 నుండి 3 సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రతలను తగ్గించగలవు.ఈ నేపథ్యంలో నగరంలో నివసించే ప్రజలకు మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఫ్లై ఓవర్ కింద కూడా సుందరీకరణ చేయడం మూలంగా వాహన కాలుష్యాన్ని నిరోధించే వెసులుబాటు కలుగుతుంది.ప్రధాన కూడళ్లు, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ తో పాటుగా పచ్చదనం కోసం అనువైన స్థలంలో మొక్కలు నాటడం జరుగుతున్నది.ఈ నేపథ్యం లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో 5ఎకరాల పైన ఎక్కువగా ఉన్న 19 మేజర్ పార్కులను ఏర్పాటు చేశారు. మరో 17 వివిధ థీమ్ పేరుతో పార్కులను ఏర్పాటు చేయడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు వ్యూహరచన చేస్తున్నారు.
కాలూష్య రహితం.. స్వఛ్చమైన వాయువు లభించే అవకాశం
వృక్ష సంపదను పెంపొందించడం, పరిసర ప్రాంతాలకు స్వఛ్చమైన ప్రాణ వాయువును అందించడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించే సాంప్రదాయ ఆటల పట్ల భావి తరాల వారికి ఆసక్తి కనబర్చేందుకు కృషి చేస్తున్నారు నగర పాలక అధికారులు.ఈ కార్యక్రమంలో బాగంగా 919 కాలనీ పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా నిర్వహిస్తున్నారు నగర పాలక అధికారులు. నివాసిత ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన పార్కులను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. నూతనంగా 56 వివిధ రకాల థీమ్ పార్క్ ల ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.