గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం.!ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రధాని లేఖ.!
హైదరాబాద్ : ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. కార్యక్రమానికి సంతోష్ శ్రీకారం చుట్టిన రోజునుండి ఇప్పటివరకు అప్రతిహతంగా ముందుకు వెళ్తోంది. అనేక మంది సామాన్య ప్రజనీకమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకుని మరోకరికి ఇదే ఛాలెంజ్ ని విసిరిన సందర్బాలు ఉన్నాయి. పరిశుభ్రతకు తోడు పచ్చదనం ఉంటే ప్రకృతి పరంగా సశ్యస్యామలంగా ఉండడమే కాకుండా పర్యవరణం ఆహ్లాందంగా ఉంటుందని సంతోష్ పలు సందర్బాల్లో స్పష్టం చేస్తుంటారు. ఇప్నుడు ఇదే కార్యక్రమానికి ముగ్దుడైన ప్రదాని నరేంద్ర మోదీ సంతోష్ కుమార్ కు లేఖ రాయడం విశేషం.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భేష్.. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కి ప్రధాని మోదీ ప్రశంస.
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కష్టానికి ఫలితం దక్కినట్టు తెలుస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చేస్తున్న బృహత్కర కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంనుండి గుర్తింపు లభిస్తున్నట్టు తెలుస్తోంది. మొక్కలు ఎంత ఎక్కువగా పెంచితే పర్యవరణం అంత రమణీయంగా ఉంటుందని, స్వచ్చమైన ఆక్సీజన్ తో పాటు పర్యావరణం కూడా పచ్చగా ఉంటూ ఉత్తేజాన్ని కలిగిస్తుందనే లక్ష్యంతో ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక మంది ప్రముఖులు, కళాకారులు, క్రీడారంగ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతోష్ ఛాలెంజ్ ను స్వీకరించి మరొకరికి ఇదే ఛాలెంజ్ ని విసిరిని సందర్బాలు అనేకం ఉన్నాయి.

పచ్చదనం పెంపు అవసరాన్ని గుర్తించాలి.. ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందన్న మోదీ..
ఇక ఇదిలా ఉండగా పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయం అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని, కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేకంగా ప్రధానమంత్రి లేఖ రాశారు. పచ్చదనం పెంచటంతో పాటు, పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలు పెట్టి, కొనసాగిస్తున్నందుకు ఎం.పీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు మోదీ.

పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం.. ఎంపి చొరవ అద్బుతంగా ఉందన్న ప్రధాని..
భూమాతను, ప్రకృతిని పూజించటం ఆది నుంచీ మన సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమని, ఆ స్పూర్తిని ప్రతీ ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కృషి చేస్తోందన్నారు. మనమందరమూ భూమాత పిల్లలమే అని, ప్రకృతితో సహజీవనం, సమన్యయం జీవనమార్గం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రకృతి పరంగా మన గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని తన లేఖలో గుర్తు చేశారు. సౌరశక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సహం, కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం లాంటి చర్యలన్నీ పర్యావరణ రక్షణకు తోడ్పాటును ఇస్తాయన్నారు.

ప్రకృతితో మన అనుబంధాన్ని తెలిపిన పుస్తకం.. వృక్ష వేదం, అందరూ చదవాలన్న ఎంపీ సంతోష్..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను తెలుపుతూ ఎం.పీ సంతోష్ కుమార్ వెలువరించిన వృక్షవేదం పుస్తకం గురించి తన లేఖలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలోని ప్రతీ ఒక్కరూ, ముఖ్యంగా యువత వృక్షవేదం పుస్తకాన్ని చదివి, ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనటం ద్వారా పచ్చదనాన్ని దేశ వ్యాప్తంగా పెంచాలని ప్రధాని ఆకాంక్షించారు. తద్వారా ఈ కార్యక్రమం మరింత వేగాన్ని, విసృతిని అందు కోవాలన్నారు. లేఖ ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందించిన ప్రధాన మంత్రికి ఎం.పీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత ముందకు తీసుకువెళ్తామన్నారు ఎం.పీ సంతోష్ కుమార్.












Click it and Unblock the Notifications