తెలంగాణలో 9వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్: వివరాలు
హైదరాబాద్: తెలంగాణలో మరో కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది. పోలీసు ఉద్యోగ నియామకాల దస్త్రంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శనివారం సంతకం చేశారు. మొత్తం 9వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
సివిల్ నియామకాల్లో 33శాతం మహిళలకు ఉండాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేహదారుఢ్య పరీక్షలను సరళతరం చేయాలని నిర్ణయించారు. 5 కిలో మీటర్ల పరుగుకు బదులు 3 పరుగు పోటీలు మాత్రమే పెట్టాలని ఆదేశించారు.
రాత పరీక్షల్లో తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యత తప్పనిసరి అని తెలిపారు. దేహ దారుఢ్యం కోసం ఆర్మ్డ్ పర్సనాలిటీ టెస్ట్ చేయనున్నారు. పోలీస్శాఖలో మొత్తం 8,300, అగ్నిమాపకశాఖలో 510 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోలీసు శాఖలో 8360, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 186, అగ్నిమాపక శాఖలో 510 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. 3200 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్, 107 మంది సివిల్ ఎస్ఐలు, 91 మంది ఆర్మ్డ్ ఎస్ఐలు, 288 మంది స్పెషల్ పోలీసు ఎస్ఐలు, 35 మంది కమ్యూనికేషన్ ఎస్ఐలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 12 మంది ఎస్ఐలు, 174 మంది కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.